ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం పతాంజలి పోటీ

     Written by : smtv Desk | Mon, Aug 10, 2020, 12:46 PM

ఐపీఎల్ 2020 టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం పతాంజలి పోటీ

చైనాకి చెందిన వివో కంపెనీ‌ని ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ నుంచి భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఇటీవల తప్పించగానే.. ఆ స్ఫాన్సర్‌షిప్ కోసం పెద్ద పెద్ద కంపెనీలు పోటీపడుతున్నాయి. ఇప్పటికే ఈ రేసులో అమెజాన్ ముందు వరుసలో ఉండగా.. బైజూస్, జియో కూడా పోటీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజాగా యోగా గురు బాబ్ రాందేవ్‌కి చెందిన పతాంజలి కూడా ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్‌పై కన్నేసినట్లు తెలుస్తోంది. ఈ మేరకు బిడ్ వేసేందుకు పతాంజలి కసరత్తులు ప్రారంభించినట్లు పతాంజలి అధికార ప్రతినిధి ఎస్.కె. టిజారావాలా వెల్లడించారు. పతాంజలిని గ్లోబల్ మార్కెట్‌లో ఉంచేందుకు ఐపీఎల్ సరైన వేదిక అని అతను అభిప్రాయపడ్డారు.

ఐపీఎల్ టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం.. బీసీసీఐతో 2018లో ఐదేళ్లకాలానికి రూ. 2,199 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్న వివో.. టైటిల్ స్ఫాన్సర్‌గా ఏటా రూ. 440 కోట్లు చెల్లించింది. ఈ అగ్రిమెంట్ ఐపీఎల్ 2022 సీజన్‌తో ముగియనుండగా.. ఈ ఏడాది కూడా వివోనే టైటిల్ స్ఫాన్సర్‌గా కొనసాగుతుందని.. రెండు వారాల క్రితం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రకటించింది. కానీ.. ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమయ్యాయి. ఎంతలా అంటే..? బాయ్‌కాట్ చైనా తరహాలోనే బాయ్‌కాట్ ఐపీఎల్‌ అని హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయ్యింది. దాంతో.. వెనక్కి తగ్గిన బీసీసీఐ.. వివోతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.

వివో స్థానంలో టైటిల్ స్ఫాన్సర్‌షిప్ కోసం బీసీసీఐ బిడ్స్‌ని ఆహ్వానించనుండగా.. వివో తరహాలో ఐపీఎల్ 2020 సీజన్‌కి రూ.440 కోట్లు స్ఫాన్సర్ చెల్లించే అవకాశాలు కనిపించడం లేదు. దానికి కారణం.. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఖాళీ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండటమే. అయితే.. స్ఫాన్సర్‌షిప్‌కి మాత్రం ఎక్కువగా పోటీ ఉండే అవకాశం ఉంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ మ్యాచ్‌లు జరగనున్నాయి.





Untitled Document
Advertisements