విజయవాడలో కోవిడ్ కేర్ సెంటర్గా ఉన్న స్వర్ణ ప్యాలెస్లో అగ్ని ప్రమాదం జరగడంతో 10 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. మంటలు, పొగ కారణంగా బాధితులు ఉక్కిరి బిక్కిరై మరణించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ హాస్పిటళ్లకు సంబంధించి ఓ షాకింగ్ న్యూస్ బయటకొచ్చింది. జీహెచ్ఎంసీ రికార్డుల ప్రకారం 1700 హాస్పిటళ్లలో 90 శాతం హాస్పిటళ్లు ఫైర్ సేఫ్టీ ప్రమాణాలకు సరిపడా ఉండకపోవడం గమనార్హం.
గతంలో ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) హాస్పిటళ్లకు నోటీసులు జారీ చేసింది. ఫైర్ సేఫ్టీ నిబంధనలు పాటించకపోతే.. కఠిన చర్యలు తీసుకుంటామని.. క్రిమినల్ కేసులు సైతం నమోదు చేసి భవనాలను సీల్ చేస్తామని హెచ్చరించింది. దీంతో 1013 హాస్పిటళ్లు ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించామని 2018 అక్టోబర్లో సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్లను జీహెచ్ఎంసీకి సబ్మిట్ చేశాయి.
హాస్పిటళ్లు అందజేసిన వివరాలను పరిశీలించి అంతా సక్రమంగా ఉంటే నో అబ్జక్షన్ సర్టిఫికెట్ జారీ చేయాలని, నిబంధనలను పాటించని హాస్పిటల్ భవనాలను సీల్ చేయాలని భావించారు. కానీ అది మధ్యలోనే ఆగిపోయింది. జనవరి, ఫిబ్రవరి నెలల్లో భూ ఆక్రమణలపై ఈవీడీఎం ఫోకస్ పెట్టింది. లాక్డౌన్ తర్వాత సిబ్బందిని కోవిడ్ డ్యూటీలో నియమించింది. దీంతో హాస్పిటళ్లకు ఎన్వోసీ జారీ చేసే ప్రక్రియ మధ్యలోనే ఆగిపోయిందని జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు.