లంక ప్రీమియర్ లీగ్ వాయిదా!

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 09:53 AM

లంక ప్రీమియర్ లీగ్ వాయిదా!

లంక ప్రీమియర్ లీగ్‌కి తొలి సీజన్‌లోనే ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఐపీఎల్ తరహాలో శ్రీలంక క్రికెట్ బోర్డు ఈ ఏడాది లంక ప్రీమియర్ లీగ్‌ (ఎల్‌పీఎల్)‌ని తెరపైకి తీసుకురాగా.. ఆగస్టు 28 నుంచి సెప్టెంబరు 20 వరకూ ఈ టోర్నీని నిర్వహించాలని షెడ్యూల్‌ని కూడా ప్రకటించింది. కానీ.. కరోనా వైరస్ నేపథ్యంలో.. ఆ దేశంలో 14 రోజుల క్వారంటైన్ ప్రొటోకాల్‌ నిబంధన ఈ టోర్నీని వాయిదాపడేలా చేసింది.

షెడ్యూల్ ప్రకారం మరో 17 రోజుల్లో లంక ప్రీమియర్ లీగ్ ప్రారంభంకావాల్సి ఉంది. మొత్తం ఐదు జట్లు ఈ టోర్నీలో పోటీపడనుండగా.. వివిధ దేశాలకి చెందిన దాదాపు 70 మంది అంతర్జాతీయ క్రికెటర్లు ఇందులో ఆడతారని శ్రీలంక క్రికెట్ బోర్డు తెలిపింది. కానీ.. వీరిలో చాలా మంది మంగళవారానికి అక్కడికి చేరుకోలేకపోయారు. మరోవైపు ఆటగాళ్ల క్వారంటైన్ గడువుని వారానికి కుదించాలని శ్రీలంక ప్రభుత్వాన్ని.. లంక క్రికెట్ బోర్డు కోరగా.. అందుకు గవర్నమెంట్ నిరాకరించింది. దాంతో.. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్‌లు నిర్వహించలేమని నిర్ధారణకి వచ్చిన బోర్డు.. లంక ప్రీమియర్ లీగ్‌ని నవంబరుకి వాయిదా వేస్తున్నట్లు ఈరోజు ప్రకటించింది.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ 2020 సీజన్ జరగనుండగా.. ఈ టోర్నీ ముగిసి తర్వాత నవంబరు 20 నుంచి డిసెంబరు 12 వరకూ లంక ప్రీమియర్ లీగ్‌ని నిర్వహించేందుకు అవకాశాలున్నట్లు లంక బోర్డు తెలిపింది. లంక ప్రీమియర్ లీగ్ వాయిదా పడటంతో.. ఐపీఎల్ 2020 సీజన్‌‌ ఫస్ట్ మ్యాచ్ నుంచి శ్రీలంక క్రికెటర్లు లసిత్ మలింగ, ఇసురు ఉదాన అందుబాటులో ఉండనున్నారు. సుదీర్ఘకాలంగా ముంబయి ఇండియన్స్ తరఫున మలింగ మ్యాచ్‌లు ఆడుతుండగా.. ఉదానాని రూ.50 లక్షలకి వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements