ఎట్టకేలకు ముగిసిన రాజస్థాన్ రాజకీయ సంక్షోభం

     Written by : smtv Desk | Wed, Aug 12, 2020, 05:35 PM

ఎట్టకేలకు ముగిసిన రాజస్థాన్ రాజకీయ సంక్షోభం

దాదాపు నెల రోజుల పాటు సాగిన రాజస్థాన్‌ రాజకీయ సంక్షోభం టీ కప్పులో తుఫాను మాదిరిగా సమసిపోయింది. పూటకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా సాగిన రాజకీయ డ్రామాకు అసమ్మతి నేత పైలట్‌తో రాహుల్‌ గాంధీ చర్చలు ఫలించి, కథ సుఖాంతమైంది. పార్టీతోనూ, ప్రభుత్వంతోనూ కలిసి పనిచేసేందుకు పైలట్‌ అంగీకరించినట్లు కాంగ్రెస్‌ పార్టీ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. న్యాయస్థానాల వరకు వెళ్లిన ఈ కథ అసెంబ్లీ సమావేశాలకు ముందు సుఖాంతమయ్యింది.

ఈ నేపథ్యంలో సచిన్‌ యూటర్న్ తీసుకోడానికి కారణాలేంటి? రాహుల్‌తో భేటీలో ఏం జరిగింది? అనేది తనకు కూడా తేలియదని రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించారు. ‘అసంతృప్తిని అధిగమించడానికి ప్రయత్నిస్తాం... నేను ముఖ్యమంత్రిని కాబట్టి.. పార్టీకి చెందిన ఎమ్మెల్యే కోపంగా ఉంటే, ఆయన మనోవేదన పరిష్కరించి, వారి హృదయాన్ని గెలవడం నా బాధ్యత అవుతుంది. నేను నా జీవితమంతా ఇలా చేశాను.. ఇకపై ఇదే కొనసాగిస్తాను’అని అన్నారు.

అశోక్ గెహ్లాట్ ప్రభుత్వంపై అసంతృప్తితో ఉన్న సచిన్.. 18 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబావుటా ఎగరవేశారు. స్పీకర్‌ నిర్ణయానికి వ్యతిరేకంగా హైకోర్టును, సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. దాదాపు, నెల రోజులుగా గెహ్లాట్, పైలట్‌ క్యాంపు రాజకీయాలతో రక్తి కట్టించారు. కానీ, అసెంబ్లీ సమావేశాలకు గడువు సమీపిస్తున్న వేళ సచిన్‌ పైలట్‌ మనసు మార్చుకున్నారు. తనవైపు ఎమ్మెల్యేల బలం తగినంత లేకపోవడమనేది ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. ఒకవేళ అసెంబ్లీ వేదికగా బల నిరూపణ జరిగితే ప్రభుత్వం కూలిపోయే పరిస్థితి లేదు.

దీంతోపాటు రాజస్థాన్‌ బీజేపీలో వర్గపోరు గెహ్లాట్‌కు వరంగా మారింది. అవిశ్వాసం పెడితే వసుంధర రాజె వర్గం కలిసొస్తుందన్న అంశంపై స్పష్టత కొరవడటం, పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తే ఉన్న పదవీ పోయే పరిస్థితి నెలకొనడం వంటివి సచిన్ రాజీ ప్రయత్నాల వైపు మొగ్గేలా చేసినట్లు తెలుస్తోంది. సచిన్‌ పైలట్‌ కూడా సీఎం అశోక్‌ గహ్లోత్‌ను మాత్రమే టార్గెట్‌చేశారే తప్ప.. కాంగ్రెస్‌ పార్టీని పల్లెత్తు మాట అనలేదు. ఈ క్రమంలో అహ్మద్‌పటేల్‌, కేసీ వేణుగోపాల్‌ వంటి నేతలు చర్చల్లో కీలకంగా వ్యవహరించడంతో రాహుల్‌తో భేటీకి మార్గం సుగమమైంది.



తన పోరాటం కేవలం అశోక్‌ గెహ్లాట్‌‌పైనే తప్ప.. కాంగ్రెస్‌ పార్టీపై కాదని సచిన్‌ పైలట్‌ చెప్పినట్లు సమాచారం. ఇకపై రెబల్‌గా ఉండబోనని వారికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనికి ప్రతిగా పైలట్‌ సహా ఆయన అనుచర ఎమ్మెల్యేలపైనా ఎలాంటి చర్యలూ ఉండబోవని అధిష్ఠానం భరోసా ఇచ్చినట్లు సమాచారం





Untitled Document
Advertisements