భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డికి కరోనా

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 09:51 AM

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డికి కరోనా

భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డికి కరోనా వైరస్ సోకింది. హైదరాబాద్‌లోని గోపీచంద్ అకాడమీలో ఇటీవల ప్రారంభమైన క్యాంప్‌నకి హాజరైన సిక్కిరెడ్డి‌తో పాటు ఫిజియోథెరపిస్ట్ కిరణ్‌ కూడా కరోనా వైరస్ బారినపడినట్లు తేలింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో.. గత మార్చి నుంచి ఆటకి దూరంగా ఉన్న షట్లర్లు.. ఇటీవల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్టేడియాలు, అకాడమీల్లో ప్రాక్టీస్‌కి అనుమతి ఇవ్వడంతో టోక్యో ఒలింపిక్స్ కోసం సన్నద్ధతని మొదలెట్టారు.

బ్యాడ్మింటన్ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్ పర్యవేక్షణలో ఇటీవల ఈ క్యాంప్ ప్రారంభమవగా.. షట్లర్లు పీవీ సింధు, సిక్కిరెడ్డి, సాయి ప్రణీత్ ఈ క్యాంప్‌నకి హాజరయ్యారు. అయితే.. ఆటగాళ్లతో పాటు కోచ్‌‌లు, సపోర్ట్ స్టాఫ్‌‌కి విధిగా కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించాలని ఇటీవల స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆదేశించింది. దాంతో.. గోపీచంద్ అకాడమీలో పరీక్షలు నిర్వహించగా.. సిక్కిరెడ్డితో పాటు కిరణ్‌కి పాజిటివ్‌గా తేలింది. కానీ.. వారిలో ఎలాంటి కరోనా వైరస్ లక్షణాలు లేవని తెలుస్తోంది.

క్యాంప్‌నకి హాజరైన ఇద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో.. గోపీచంద్ అకాడమీని శానిటైజేషన్ కోసం తాత్కాలికంగా మూసివేశారు. సిక్కిరెడ్డితో క్లోజ్ కాంటాక్ట్‌లో ఉన్న షట్లర్ల‌కి మరోసారి పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఇటీవల బెంగళూరులో ఏర్పాటు చేసిన హాకీ క్యాంప్‌‌లో ఏకంగా ఐదుగురు ఆటగాళ్లకి కరోనా పాజిటివ్‌గా తేలిన విషయం తెలిసిందే.




Untitled Document
Advertisements