సుప్రీం జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్‌లు...ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన కోర్టు!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 12:57 PM

సుప్రీం జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్‌లు...ప్రశాంత్ భూషణ్‌ను దోషిగా తేల్చిన కోర్టు!

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డేకు వ్యతిరేకంగా ట్వీట్‌లు చేసిన సీనియర్ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌‌ను సర్వోన్నత న్యాయస్థానం దోషిగా తేల్చింది. ఈ కేసులో జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కృష్ణమురారీల ధర్మాసనం ఈ మేరకు ఆయనను దోషిగా నిర్ధారించింది. ఈ కేసు విచారణ శుక్రవారం పూర్తిచేసిన సుప్రీంకోర్టు.. ఆయనకు ఆగస్టు 20 కేసు ఖరారుచేయనుంది.

అయితే, వ్యక్తిగత స్వేచ్ఛను వినియోగించుకుని, కోర్టు పనితీరు గురించి అభిప్రాయాన్ని వ్యక్తం చేశాను తప్పా కోర్టు ధిక్కార చర్యలకు పాల్పడలేదని ప్రశాంత్ భూషణ్ తన వాదనలు వినిపించారు. ఆగస్టు 3న దాఖలుచేసిన అఫిడవిట్‌లో తాను ట్వీట్ చేసిన వాటిలో కొంత భాగాన్ని మాత్రమే చింతిస్తున్నానని, ఉన్నతాధికారిపై విమర్శలు న్యాయస్థానం ప్రతిష్ఠకు భంగం కలిగించవని, దాని అధికారాన్ని తగ్గించవని ప్రశాంత్ భూషణ్ పేర్కొన్నారు.

ప్రశాంత్ భూషణ్‌ 2009లోనూ సుప్రీంకోర్టు న్యాయమూర్తులపై సంచలన ఆరోపణలు చేశారు. సుప్రీంకోర్టులోని 16 మంది న్యాయమూర్తులు అవినీతిపరులేనంటూ ఓ ఇంటర్వ్యూలో వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై కూడా దేశ అత్యున్నత న్యాయస్థానం సోమవారం విచారించింది. ఈ కేసులో ప్రశాంత్‌ భూషణ్‌ వివరణ, క్షమాపణలను సుప్రీం కోర్టు తిరస్కరించింది. అంతేకాక ప్రశాంత్‌ భూషణ్‌ చేసిన వ్యాఖ్యలు కోర్టు ధిక్కారం కిందకు వస్తాయా లేదా అన్నది పరిశీలించనున్నట్లు తెలిపింది. తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేసింది.

అయితే, ఈ అంశంపై ప్రశాంత్ భూషణ్ క్షమాపణలు చెప్పారు. ‘16 మంది ప్రధాన న్యాయమూర్తులు అవినీతిపరులంటూ నేను చేసిన వ్యాఖ్యల వల్ల ఎవ‌రు ఇబ్బందిప‌డ్డా.. వారి కుటుంబ సభ్యులకు బాధ కలిగినా అందుకు నేను క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నాను’ అంటూ ప్ర‌శాంత్ భూషణ్‌ ఓ ప్ర‌క‌ట‌న విడుదల చేశారు. లాయ‌ర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌ను ప్ర‌చురించిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు త‌రుణ్ తేజ్‌పాల్ కూడా క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.





Untitled Document
Advertisements