సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు: పవార్ కుటుంబంలో చిచ్చు!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 02:18 PM

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు: పవార్ కుటుంబంలో చిచ్చు!

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణంపై రాజకీయ దుమారం రేగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగించాలంటూ డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తనయుడు పార్థ్ పవార్ డిమాండ్ చేశారు. అయితే, సీబీఐ విచారణకు డిమాండ్ చేసిన పార్థ్‌ను ఎన్‌సీపీ చీఫ్ శరద్ పవార్ బహిరంగంగా మందలించారు. దీనిపై మీడియాలో పెద్ద ఎత్తున్న ప్రచారం కావడంతో తాజాగా వివాదానికి

శివసేన తెరదించింది. ఈ అంశంపై మీడియా అత్యుత్సాహం ప్రదర్శించిందని, సంకీర్ణ ప్రభుత్వంలో ఎలాంటి విబేధాలు లేవని స్పష్టం చేసింది.

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై సీబీఐ విచారణ అవసరంలేదని, పార్థ్ చేసిన వ్యాఖ్యలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరంలేదని శరద్ పవార్ అన్నారు. అంతేకాదు, పార్థ్‌ను పరిపక్వతలేకుండా మాట్లాడారని వ్యాఖ్యానించారు. పార్థ్‌ను శరద్ పవార్ బహిరంగంగా మందలించారని, ఇది రాజకీయ తుఫాను కాదు కదా.. టీ కప్పులో తుఫాను కూడా కాదని తన అధికార పత్రిక సామ్నా సంపాదకీయంలో పాలక శివసేన పేర్కొంది.

ఈ విషయంలో శరద్ పవార్ చేసింది తప్పుకాదని తెలిపింది. ‘కొందరు (మీడియా సంస్థలు) తమ పబ్బం గడుపుకోడానికి కృత్రిమ తుఫాను సృష్టిస్తారు. పార్థ్‌పై శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలు పవార్ కుటుంబంలో సఖ్యత లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారు’ అని వ్యాఖ్యానించింది. ‘శరద్ పవార్ ఓ సీనియర్ రాజకీయ నేత, పార్టీకి అధినేత.. జూనియర్లను మందలించే అధికారం ఉంది.. దివంగత బాల్‌థాకరే ఇలాగే చేసేవారు’అని పేర్కొంది.

నోరు అదుపులో ఉంచుకోకపోతే అనేక సమస్యలు ఎదుర్కొవాల్సి ఉంటుంది.. అజిత్ పవార్ కూడా అలాంటి సమస్యలనే ఎదుర్కొంటున్నారని వివరించింది. ‘కాబట్టి ఇప్పుడు ఆయన తనను తాను నియంత్రిస్తాడు. ఆయన కుమారుడు పార్థ్ రాజకీయాలకు కొత్త.. అందుకే ఆయన ప్రకటనలు వివాదాన్ని సృష్టిస్తాయి. కొంతమంది సీనియర్, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులు కూడా సీబీఐ దర్యాప్తునకు డిమాండ్ చేశారు’ అని తన సంపాదకీయంలో పరోక్షంగా బీజేపీ నేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌కు చురకలంటించింది.

‘శరద్ పవార్ తన మనవడిని మందలించడంతో వివాదానికి తెరపడిందని, దానిని భూతద్దంలో చూపుతూ ఎక్కువచేయడం తగదని హితవు పలికింది. అంతేకాదు, అయోధ్యలో రామమందిర నిర్మాణాన్ని కూడా పార్థ్ స్వాగతిస్తూ ఓ లేఖ కూడా రాశారాన్నారు. సుప్రీంకోర్టు అనుమతితోనే ఆలయాన్ని నిర్మిస్తున్నారని, దీనికి అనుకూలంగా మాట్లాడం తప్పెలా అవుతుందని అన్నారు.





Untitled Document
Advertisements