కరోనా మహమ్మారి ప్రపంచం మొత్తాన్ని కుదిపేస్తోంది. రోజురోజుకూ కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే, కరోనా బారిన పడి కోలుకున్న వారు మళ్లీ దాని బారిన పడిన ఘటనలు ఇంత వరకు ఎదురుకాలేదు. దీంతో, కరోనా ఒకసారి వస్తే మళ్లీ వచ్చే అవకాశం లేదనే వార్తలు కూడా వచ్చాయి. అయితే, చైనాలో తాజాగా జరిగిన పరిణామం అందరినీ ఆందోళనలోకి నెట్టివేసేదే. కొన్ని నెలక్రితం కరోనా నుంచి కోలుకున్న ఇద్దరు వ్యక్తులు మళ్లీ ఆ మహమ్మారి బారిన పడ్డారు.
చైనాలోని సెంట్రల్ ప్రావిన్స్ అయిన హుబేలో 68 ఏళ్ల మహిళకు గత డిసెంబర్ లో కరోనా సోకింది. గత ఆదివారం నాడు ఆమెకు మళ్లీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో వ్యక్తి ఏప్రిల్ లో కరోనా బారిన పడ్డాడు. విదేశాల్లో ఉంటున్న ఆయన ఇటీవలే షాంఘై వచ్చాడు. సోమవారం ఆయనకు కరోనా పాజిటివ్ అని తేలింది. అయితే ఆయనలో కరోనా లక్షణాాలు మాత్రం కనిపించడం లేదు.
ఏదేమైనప్పటికీ కరోనా నుంచి కోలుకున్నవారు మళ్లీ దాని బారిన పడటంపై వైద్య నిపుణులు దృష్టి సారిస్తున్నారు. రీ-ఇన్ఫెక్షన్ ను ఎదుర్కొనే రోగనిరోధక శక్తి వారిలో లోపించి ఉండవచ్చని కొందరు అభిప్రాయపడ్డారు. ట్రీట్మెంట్ సమయంలో శరీరంలో అభివృద్ది చెందిన యాంటీబాడీలు తక్కువ సమయంలోనే డ్రాప్ అయి ఉండొచ్చని... అందువల్లే రెండోసారి మహమ్మారి బారిన పడే అవకాశం ఏర్పడి ఉండొచ్చని మరికొందరు చెపుతున్నారు.