ఐపీఎల్ 2020: 10 సెకన్ల యాడ్‌‌కి రూ.10 లక్షలు!

     Written by : smtv Desk | Fri, Aug 14, 2020, 04:50 PM

ఐపీఎల్ 2020: 10 సెకన్ల యాడ్‌‌కి రూ.10 లక్షలు!

ఐపీఎల్ 2020 సీజన్ హంగామా మరికొద్ది రోజుల్లోనే మొదలుకాబోతోంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకూ ఐపీఎల్ జరగనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ).. ఈ మేరకు మ్యాచ్‌ల షెడ్యూల్‌పై కసరత్తులు చేస్తోంది. మొత్తం 53 రోజుల విండోలో 60 మ్యాచ్‌లు జరగనుండగా.. ఇందులో 10 డబుల్ హెడర్ మ్యాచ్‌లు ఉండే అవకాశం ఉంది. గత సీజన్లతో పోలిస్తే అరగంట ముందే మ్యాచ్‌లు అంటే..? మధ్యాహ్నం 3.30 గంటలకి, రాత్రి 7.30లకి మ్యాచ్‌లు మొదలుకానున్నాయి.

కరోనా వైరస్ నేపథ్యంలో.. ఖాళీ స్టేడియాల్లో ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనుండగా.. వ్యూవర్‌షిప్‌ రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉంది. దాంతో.. ఐపీఎల్ 2020 సీజన్ యాడ్స్ విషయంలో బ్రాడ్‌కాస్టర్ స్టార్‌స్పోర్ట్స్ వ్యూహాత్మకంగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా వెలువడిన వార్తల ప్రకారం.. 10 సెకన్ల యాడ్‌కి రూ.10 లక్షల ధరని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ మధ్యలోనే దసరా, దీపావళి కూడా వస్తుండటంతో.. యాడ్స్‌ ఇచ్చేందుకు కంపెనీలు కూడా పోటీపడే అవకాశం ఉంది. ఐపీఎల్ 2019 సీజన్‌లో యాడ్స్‌ ద్వారా స్టార్‌స్పోర్ట్స్ రూ.3000 కోట్లు ఆదాయం ఆర్జించినట్లు గణాంకాలు చెప్తున్నాయి.

2019 వన్డే ప్రపంచకప్ సమయంలో స్టార్‌స్పోర్ట్స్ భారీగా యాడ్స్ ధరని పెంచేసింది. టోర్నీ టైమ్‌లో 10 సెకన్ల యాడ్‌కి రూ. 16-18 లక్షలు వసూలు చేసిన స్టార్‌స్పోర్ట్స్.. భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌ సమయంలో ఏకంగా రూ.25 లక్షలు వసూలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో.. ఐపీఎల్ 2020 సీజన్‌లోనూ 10 సెకన్ల యాడ్‌కి రూ.10 లక్షలు వసూలు చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2019 సీజన్‌‌ వ్యూవర్‌షిప్ 424 మిలియన్‌కాగా.. ఇందులో 51 శాతం మంది టోర్నీని టీవీల్లోనే వీక్షించడం కొసమెరుపు.





Untitled Document
Advertisements