ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ బరోడా తాజాగా రైతులకు తీపికబురు అందించింది. సరికొత్త స్కీమ్ను అందుబాటులోకి తీసుకువచ్చింది. వ్యవసాయ యాంత్రీకరణను ప్రోత్సహించాలనే లక్ష్యంతో బ్యాంక్ ఈ పథకాన్ని ఆవిష్కరించింది. దీని వల్ల అన్నదాతలకు ప్రయోజనం కలుగనుంది.
‘కోవిడ్ 19 కారణంగా అతితక్కువ ప్రతికూల ప్రభావాన్ని ఎదుర్కొన్న రంగం ఒక్క వ్యవసాయ రంగం మాత్రమే. సాధారణ స్థాయికి కన్నా ఇప్పుడు వర్షాలు ఎక్కువగానే కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో వ్యవసాయ రంగం కారణంగా ఆర్థిక వ్యవస్థ పుంజుకోవచ్చు’ అని బ్యాంక్ ఆఫ్ బరోడా (BoB) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ తెలిపారు. అందుకే వ్యవసాయ రంగం లక్ష్యంగా కొత్త రుణ పథకాన్ని తీసుకువచ్చామని పేర్కొన్నారు.
లక్నో జోన్లో మాదిరిగా దేశవ్యాప్తంగా కూడా క్లస్టర్ మోడల్ ఆఫ్ ట్రాక్టర్ ఫైనాన్స్ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. అహ్మదాబాద్, బరోడా, రాజ్కోట్, భోపాల్, పుణే, హైదరాబాద్, బెంగళూరు, మంగళూరు, మీరట్, ఛండీఘర్ జోన్లలో ఈ తరహా ఫైనాన్స్ సేవలను కస్టమర్లకు అందించనుంది. దీనిలో భాగంగా బ్యాంక్ ప్రత్యేక అధికారుల ద్వారా సులభంగానే వేగంగా రుణాలు అందిస్తుంది.
అంతేకాకుండా బ్యాంక్ ఆఫ్ బరోడా.. గ్రోమ్యాక్స్ అగ్రి ఎక్విప్మెంట్ కంపెనీతో భాగస్వామ్యం కూడా కుదుర్చుకుంది. ఇది మహీంద్రా గ్రూప్నకు చెందిన కంపెనీ. ఈ భాగస్వామ్యంలో భాగంగా కస్టమర్లు బ్యాంక్ నుంచి లోన్ తీసుకొని ట్రాక్టర్ కొనుగోలు చేస్తే రూ.లక్ష వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. అయితే ఇది గుజరాత్లో వర్తిస్తుంది. ఇతర రాష్ట్రాల్లో కస్టమర్లు రూ.15,000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.