భారీగా పెరిగిన అప్పులు...తొలిసారి రూ.100 ట్రిలియన్ పైకి

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 01:29 PM

భారీగా పెరిగిన అప్పులు...తొలిసారి రూ.100 ట్రిలియన్ పైకి

మొట్టమొదటి సారిగా కేంద్ర ప్రభుత్వపు రుణం రూ.100 ట్రిలియన్ మార్క్‌ను దాటిపోయింది. అంటే రూ.100 లక్షల కోట్లు పైకి చేరింది. ఇదిక కూడా జూన్ నెల చివరి నాటికి. అంటే ఇప్పటికీ ఇంకా 3 నెలలు దాటిపోయింది. అంటే రుణం మరింత పెరిగి ఉంటుంది. ఆర్థిక మంత్రిత్వ శాఖ త్రైమాసిక నివేదికలో ఈ విషయం వెల్లడైంది.

ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం చూస్తే.. మోదీ సర్కార్ రుణం భారీగా పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2020 ఏప్రిల్-జూన్) అప్పు ఏకంగా రూ.7 లక్షల కోట్లు పెరిగింది. ఈ స్థాయిలో అప్పు పెరగడం గమనార్హం. దీంతో కేంద్రం రుణ భారం రూ.101.3 లక్షల కోట్ల మార్క్‌ను దాటిపోయింది.

ప్రస్తుతం కేంద్రం రుణ భారం జీడీపీలో 43 శాతంగా ఉంది. 2020-21 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి ఇది 60 శాతానికి చేరొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫిస్కల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్‌మెంట్ రూల్స్ 2017 ప్రకారం 2023 మార్చి నాటికి కేంద్రం రుణం జీడీపీలో 40 శాతానికి లోపు ఉండాలి. కానీ ప్రభుత్వం మాత్రం దీన్ని అనుసరించడం లేదు.

కాగా కేంద్ర ప్రభుత్వం అప్పు గతేడాది జూన్‌ నెల చివరి నాటికి రూ.88.18 లక్షల కోట్లుగా ఉంది. ఇప్పుడు ఇది రూ.101.3 లక్షల కోట్లకు పెరిగింది. ఇందులో పబ్లిక్ డెట్ వాటా 91.1 శాతంగా ఉంది. 2020 మార్చి చివరి నాటికి కేంద్ర రుణ భారం రూ.94.6 లక్షల కోట్లుగా ఉండటం గమనార్హం. అంటే కరోనా టైమ్ నుంచి అప్పు ఒక్కసారిగా పెరిగింది.

మోదీ సర్కార్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3.46 లక్షల కోట్ల విలువైన సెక్యూరిటీ బాండ్లను విడుదల చేసింది. వీటి సగటు మెచ్యూరిటీ కాలం 14.61 సంవత్సరాలు. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో కేంద్ర ప్రభుత్వం రూ.21 వేల కోట్ల సెక్యూరిటీ బాండ్లను ఇష్యూ చేసింది. అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం క్యాష్ మేనేజ్‌మెంట్ బిల్లు ద్వారా 2020 ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో రూ.80 వేల కోట్లు సమీకరించింది.





Untitled Document
Advertisements