ఐపీఎల్ 2020: నాటౌట్ అయినా పెవిలియన్‌కి మురళీ విజయ్!

     Written by : smtv Desk | Sun, Sep 20, 2020, 03:35 PM

ఐపీఎల్ 2020: నాటౌట్ అయినా పెవిలియన్‌కి మురళీ విజయ్!

ముంబయి ఇండియన్స్‌తో అబుదాబి వేదికగా శనివారం రాత్రి జరిగిన ఐపీఎల్ 2020 సీజన్ తొలి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ ఓపెనర్ మురళీ విజయ్ అప్పనంగా వికెట్ సమర్పించుకున్నాడు. మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 9 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేయగా.. ఛేదనలో చెన్నైకి ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బలు తగిలింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్‌‌లోనే ట్రెంట్ బౌల్ట్ బౌలింగ్‌లో ఓపెనర్ షేన్ వాట్సన్ (4) ఔటవగా.. తర్వాత రెండో ఓవర్ చివరి బంతికి జేమ్స్ పాటిన్సన్ బౌలింగ్‌లో మరో ఓపెనర్ మురళీ విజయ్ (1) కూడా వికెట్ చేజార్చుకున్నాడు. ఈ ఇద్దరూ ఎల్బీడబ్ల్యూగా ఔటవగా.. మురళీ విజయ్ నాటౌట్ అయినా తొందరపడ్డాడు.

ఇన్నింగ్స్ రెండో ఓవర్ వేసిన పాటిన్సన్ బౌలింగ్‌లో నాలుగో బంతికి వికెట్ల ముందు మురళీ విజయ్ అడ్డంగా దొరికిపోయాడు. ముంబయి ఫీల్డర్లు ఎల్బీడబ్ల్యూ ఔట్ కోసం అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ తిరస్కరించాడు. రిప్లైలో బంతి స్టంప్స్‌ని తాకేలా కనిపించింది. కానీ.. అదే ఓవర్‌లో చివరి బంతికి కూడా మురళీ విజయ్ అదే తరహాలో ఎల్బీడబ్ల్యూగా దొరికిపోయాడు. దాంతో.. ఈ సారి ఫీల్డ్ అంపైర్ ఔటివ్వగా.. రిప్లైలో బంతి వికెట్లకి దూరంగా వెళ్తున్నట్లు కనిపించింది. అయినప్పటికీ.. కనీసం డీఆర్‌ఎస్ కూడా కోరకుండానే పెవిలియన్‌కి వెళ్లిన మురళీ విజయ్‌‌ని చెన్నై అభిమానులు ఆడుకుంటున్నారు.

వాస్తవానికి మురళీ విజయ్‌‌ని డీఆర్‌ఎస్ కోరమని నాన్‌స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న అతని సహచర బ్యాట్స్‌మెన్ డుప్లెసిస్ సూచించాడు. కానీ.. అతని సూచనలు పట్టించుకోని మురళీ విజయ్ నేరుగా పెవిలియన్‌వైపు నడుచుకుంటూ వెళ్లిపోయాడు. ఇప్పటికే టీమిండియాకి దూరమైపోయిన మురళీ విజయ్‌కి ఐపీఎల్ 2019 సీజన్‌లో కేవలం రెండు మ్యాచ్‌ల్లో మాత్రమే ఆడే అవకాశం లభించింది. అయితే.. ఐపీఎల్ 2020 సీజన్ ముంగిట టోర్నీ నుంచి సురేశ్ రైనా వైదొలగడంతో విజయ్‌కి ఫస్ట్ మ్యాచ్‌లోనే అవకాశం దక్కింది. కానీ.. తొందరపాటు కారణంగా మొదటి ఛాన్స్‌ని వేస్ట్ చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై టీమ్ 5 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది.





Untitled Document
Advertisements