ఉత్కంఠ పోరు లో యువ ఢిల్లీ విజయం ... మయాంక్ శ్రమ వృధా ...

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 10:02 AM

ఐపీఎల్‌లో నిన్న అసలైన మజా కనిపించింది. ఢిల్లీ కేపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన పోరులో విజయం చివరి వరకు ఊగిసలాడింది. చివరికి ఓడిపోతుందని భావించిన ఢిల్లీని విజయం వరించింది. పంజాబ్ జట్టు గెలుపు ముంగిట బోల్తాపడింది. తొలుత టాస్ గెలిచిన పంజాబ్ వ్యూహాత్మకంగా ఢిల్లీని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది.

క్రీజులోకి వచ్చిన ఢిల్లీ ఆటగాళ్లు పంజాబ్ బౌలర్ల దెబ్బకు విలవిల్లాడారు. క్రీజులో కుదురుకునేందుకు నానా అవస్థలు పడ్డారు. నాలుగు ఓవర్లలో 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాలో పడిన జట్టును కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్, రిషభ్ పంత్‌లు ఆదుకునే ప్రయత్నం చేశారు.

ఇద్దరూ కలిసి నెమ్మదిగా ఆడుతూ క్రీజులో నిలదొక్కుకున్నారు. అయితే, ఐపీఎల్‌లో అందరూ ఊహించే భారీ హిట్టింగులు లేకపోవడంతో మ్యాచ్ చప్పగా సాగుతున్నట్టు అనిపించింది. ఈ క్రమంలో వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన అయ్యర్ జోష్ నింపే ప్రయత్నం చేశాడు. అయితే, ఆ వెంటనే పంత్, అయ్యర్ వెంటవెంటనే అవుటవడంతో ఇక ఢిల్లీ పనైపోయిందనుకున్నారు. పంత్ 29 బంతుల్లో 4 ఫోర్లతో 31 పరుగులు చేయగా, అయ్యర్ 32 బంతుల్లో మూడు సిక్సర్లతో 39 పరుగులు చేశాడు. అప్పటికి స్కోరు 14.1 ఓవర్లలో 87 మాత్రమే.

అయితే, ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన స్టోయినిస్ ఒక్కసారిగా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. 21 బంతుల్లో 3 సిక్సర్లు, 7 ఫోర్లతో 53 పరుగులు చేసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. అతడి పుణ్యమా అని జట్టు గౌరవ ప్రదమైన స్కోరు చేయగలిగింది. 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 157 పరుగులు చేసి ప్రత్యర్థి ఎదుట ఓ మాదిరి విజయ లక్ష్యాన్ని ఉంచింది. పంజాబ్ బౌలర్లలో మహ్మద్ షమీ మూడు వికెట్లు తీసుకోగా, కార్టెల్ రెండు వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్ ఓ వికెట్ తీసుకున్నాడు.

అనంతరం 158 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన పంజాబ్ బ్యాటింగ్ కూడా పడుతూ లేస్తూ సాగింది. 21 పరుగులు చేసిన రాహుల్ ఔటయ్యాక వరుసపెట్టి వికెట్లను కోల్పోతూ పరాజయం దిశగా సాగుతున్నట్టు కనిపించింది. అయితే, ఓపెనర్ మయాంక్ అగర్వాల్ క్రీజులో పాతుకుపోయి చివర్లో చెలరేగిపోయాడు. 60 బంతుల్లో 4 సిక్సర్లు, 7 ఫోర్లతో 89 పరుగులు చేసి జట్టును విజయం వైపు నడిపించాడు. చివరి ఓవర్లో 13 పరుగులు అవసరం కాగా, 3 బంతుల్లో 12 పరుగులు వచ్చాయి. ఇక విజయానికి ఒకే ఒక్క పరుగు అవసరమైన తరుణంలో డ్రామా మొదలైంది. చివరి మూడు బంతుల్లో ఒక్క పరుగు కూడా చేయలేకపోయిన పంజాబ్ రెండు వికెట్లు చేజార్చుకుంది. చివరి బంతికి మయాంక్ అవుటవడంతో పంజాబ్ కథ ముగిసింది. మ్యాచ్ టైగా ముగిసింది.

మ్యాచ్ విజేతను నిర్ణయించేందుకు సూపర్ ఓవర్ అవసరం అయింది. ఈ ఓవర్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ రబడ బౌలింగ్‌లో రెండు పరుగులు మాత్రమే చేసి రెండు వికెట్లు కోల్పోయింది. ఢిల్లీ కేపిటల్స్ రెండు బంతుల్లోనే మూడు పరుగుల లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని అందుకుంది. జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన స్టోయినిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.





Untitled Document
Advertisements