అంపైర్ తప్పిదం: సెహ్వాగ్, ప్రీతీ జింటా ఫైర్...బీసీసీఐ కొత్త రూల్స్ అంటూ ట్వీట్

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 11:58 AM

అంపైర్ తప్పిదం: సెహ్వాగ్, ప్రీతీ జింటా ఫైర్...బీసీసీఐ కొత్త రూల్స్ అంటూ ట్వీట్

దుబాయ్ వేదిక ఢిల్లీ క్యాపిటల్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో అంపైరింగ్ తప్పిదం మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది. ‘షార్ట్ రన్’ ఎఫెక్ట్‌తో ఒక పరుగులో కోత పడటంతో... పంజాబ్ జట్టు మ్యాచ్‌ను టైగా ముగించింది. దీంతో అది సూపర్ ఓవర్‌కు దారి తీయడం.. ఆ తర్వాత ఢిల్లీ గెలవడం తెలిసిందే.

పంజాబ్ విజయానికి 10 బంతుల్లో 21 రన్స్ అవసరమైన దశలో.. రబాడ వేసిన ఔట్ సైడ్ ఫుల్ టాస్‌ను మయాంక్ ఎక్స్ ట్రా కవర్ దిశగా బాదాడు. నాన్ స్ట్రైక్ ఎండ్‌లో ఉన్న జోర్డాన్, మయాంక్ రెండు పరుగులు తీశారు. కానీ జోర్డాన్ బ్యాట్‌ను క్రీజులో ఉంచలేదనే కారణంతో స్క్వేర్ లెగ్ అంపైర్ ఒక పరుగులో కోత విధించాడు. కానీ రిప్లేలో జోర్డాన్ బ్యాట్ అంచు క్రీజును దాటి లోపలికి వచ్చిందని తేలింది. కానీ షార్ట్ రన్ కోత మాత్రం తప్పలేదు.

ఈ నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. ఆఖరి ఓవర్లో పంజాబ్ విజయానికి 13 రన్స్ అవసరం కాగా.. మయాంక్ వరుసగా 6, 4, 2 బాదాడు. కానీ తర్వాతి బంతిని వదిలేసి.. ఐదో బాల్‌ను సిక్స్ మలిచే క్రమంలో ఔటయ్యాడు. ఆరో బంతికి జోర్డాన్ పెవిలియన్ చేరడంతో మ్యాచ్ టైగా ముగిసింది. అంపైర్ ‘షార్ట్ రన్’ తప్పిదమే లేకపోతే.. 20.3 ఓవర్లలోనే పంజాబ్ మ్యాచ్‌ను గెలిచేది.

ఒక్క పరుగు మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. కాబట్టి ఇలాంటి నిర్ణయాల సమయంలో టెక్నాలజీని వాడుకోవాలని.. థర్డ్ అంపైర్ జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై మాజీ క్రికెటర్.. గతంలో పంజాబ్ మెంటార్‌గా వ్యవహరించిన వీరేందర్ సెహ్వాగ్ ఘాటుగా స్పందించారు. ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఛాయిస్‌తో నేను ఏకీభవించను. షార్ట్ రన్ కోత విధించిన అంపైర్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలి. అది షార్ట్ రన్ కాదు. అదే మ్యాచ్ ఫలితాన్ని మార్చేసింది’ అని వీరూ ట్వీట్ చేశాడు.

అంతకు ముందు థర్డ్ అంపైర్ పాల్ రౌఫెల్‌కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ ఇవ్వాలని ట్వీట్ చేసిన వీరూ.. తర్వాత దాన్ని డిలీట్ చేసి మరో ట్వీట్ చేశాడు. కానీ అప్పటికే స్క్రీన్ షాట్లు తీసిన ఫ్యాన్స్.. దాన్ని సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

సెహ్వాగ్ ట్వీట్ పట్ల ప్రీతి జింటా స్పందిస్తూ... ‘కోవిడ్ సమయంలోనూ నేను ఉత్సాహంగా యూఏఈకి వచ్చాను. ఆరు రోజులు క్వారంటైన్లో గడిపాను, ఐదుసార్లు కోవిడ్ టెస్టులు చేయించుకున్నాను. ఇవన్నీ చిరునవ్వుతోనే చేశాను. కానీ ఒక్క షార్ట్ రన్ నాపై బలంగా ప్రభావం చూపింది. వాడుకోలేనప్పుడు టెక్నాలజీ ఎందుకు? కొత్త రూల్స్ ప్రవేశపెట్టడానికి ఇదే సమయం అంటూ బీసీసీఐ’’ని ఆమె ట్యాగ్ చేశారు. అంపైరింగ్ తప్పిదం పట్ల మండిపడుతూ నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు.









Untitled Document
Advertisements