ఆర్సీబీతో సన్‌రైజర్స్ బిగ్ ఫైట్

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 01:00 PM

ఆర్సీబీతో సన్‌రైజర్స్ బిగ్ ఫైట్

ఐపీఎల్ 2020లో మరో ఆసక్తికర సమరానికి తెర లేచింది. విరాట్ కోహ్లి సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.. డేవిడ్ వార్నర్ నాయకత్వంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ నేడు (సెప్టెంబర్ 21) తలపడబోతున్నాయి. గత సీజన్లో కేన్ విలియమ్సన్ సన్‌రైజర్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఈ సీజన్లో ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలను వార్నర్‌కే కట్టబెట్టింది.

ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ ఆర్సీబీపై సన్‌రైజర్స్‌దే పైచేయిగా ఉంది. ఇరు జట్లు 14 సార్లు పోటీ పడగా.. 8 సార్లు సన్‌రైజర్స్‌ను విజయం వరించగా.. కోహ్లి సేన ఆరుసార్లు గెలుపొందంది. ఆర్సీబీ బ్యాటింగ్‌లో కోహ్లి, డివిలియర్స్‌, ఆరోన్ ఫించ్ లాంటి స్టార్లు ఉన్నారు. మరోవైపు సన్‌రైజర్స్ ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో మీద అతిగా ఆధారపడుతోంది.

తుది జట్టు ఎంపిక కోసం ఇద్దరు కెప్టెన్లూ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ఆర్సీబీ తరఫున కొత్త ఓపెనర్లు బరిలో దిగే ఛాన్స్ ఉంది. ఆర్సీబీలో కీలక ఆటగాళ్లయిన డివిలియర్స్, ఆరోన్ ఫించ్, మొయిన్ అలీ, క్రిస్ మోరిస్, డెల్ స్టెయిన్, ఆడమ్ జంపా విదేశీయులు. వీరిలో డివిలియర్స్, మొయిన్ అలీకి తుది జట్టులో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. మిగతా వారిలో స్టెయిన్, మోరిస్‌లకు కోహ్లి ఛాన్స్ ఇవ్వొచ్చు.

సన్‌రైజర్స్ విషయానికి వస్తే.. పిచ్‌ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో రషీద్ ఖాన్‌తోపాటు వరల్డ్ నంబర్ వన్ ఆల్‌రౌండర్, మరో అప్ఘాన్ ప్లేయర్ మహ్మద్ నబీ బరిలో దిగడం ఖాయంగా కనిపిస్తోంది. వార్నర్, బెయిర్‌స్టో‌ కూడా విదేశీయులే కావడంతో... గరిష్టంగా నలుగురు విదేశీ ఆటగాళ్లకే తుది ఎలెవన్‌లో చోటు అనే నిబంధన కారణంగా విలియమ్సన్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవచ్చు. పేస్ విభాగాన్ని భువనేశ్వర్ కుమార్ ముందుకు నడుపుతాడు.

ఆర్సీబీ బౌలింగ్‌ విభాగంలో డేల్ స్టెయిన్, ఉమేశ్ యాదవ్‌లతోపాటు స్పిన్నర్ యుజువేంద్ర చాహల్ కీలకం కానున్నారు. ఇరు జట్లలోనూ మిడిలార్డర్ బలహీనంగా కనిపిస్తోంది. యువ ఆటగాళ్లు అబ్దుల్ సమద్, విరాట్ సింగ్, ప్రియమ్ గార్గ్‌లపై సన్‌రైజర్స్ భారీగానే ఆశలు పెట్టుకుంది. వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు రషీద్, నబీ.. పేసర్ భువీతో సన్‌రైజర్స్ బౌలింగ్ విభాగం ఆర్సీబీ కంటే బలంగా ఉంది. ఓపెనర్లు వార్నర్, బెయిర్‌స్టో రాణించి.. బౌలర్లు సత్తా చాటితే ఈ ఐపీఎల్‌ను సన్‌రైజర్స్ విజయంతో ఆరంభించే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

ఐపీఎల్ 2020 కోసం ఇరు జట్లూ కొత్త కోచింగ్ స్టాఫ్‌ను నియమించుకున్నాయి. ఆర్సీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా న్యూజిలాండ్ మాజీ కోచ్ మైక్ హెస్సన్‌‌ను నియమించింది. సైమన్ కటిచ్, శ్రీధరన్ శ్రీరామ్, శంకర్ బసు అతడికి సహకరించనున్నారు. సన్‌రైజర్స్ టామ్ మూడీ స్థానంలో ఇంగ్లాండ్ కోచ్ ట్రెవర్ బెయిలీస్‌ను కోచ్‌గా నియమించింది. బ్రెయిలీస్‌కు బ్రాడ్ హడిన్ సహకరించనున్నాడు. లక్ష్మణ్, ముత్తయ్య మురళీధరన్‌లు.. సన్‌రైజర్స్ కోసం వ్యూహాలు రచిస్తున్నారు.





Untitled Document
Advertisements