దేశంలో నాలుగు ప్రీ క్లినికల్ స్టేజ్‌లో కోవిడ్ టీకాలు: కేంద్రం

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 02:16 PM

దేశంలో నాలుగు ప్రీ క్లినికల్ స్టేజ్‌లో కోవిడ్ టీకాలు: కేంద్రం

కరోనా వైరస్‌‌ను కట్టడిచేసే వ్యాక్సిన్ కోసం ముమ్మర పరిశోధనలు సాగుతున్నాయి. భారత్‌లోనూ టీకా ప్రయోగాలు కొనసాగుతున్నాయి. దేశంలో వ్యాక్సిన్ అభివృద్ధి విషయంపై కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్‌ పార్లమెంటుకు వివరాలు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా 145 సంస్థలు వ్యాక్సిన్‌ అభివృద్ధి ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నాయని పేర్కొన్నారు. ఇందులో ఇప్పటి వరకు 35 వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయని హర్షవర్ధన్ చెప్పారు. అలాగే దేశంలో వ్యాక్సిన్‌ తయారీకి 30 ఫార్మా సంస్థలు కృషి చేస్తున్నాయని, ఆ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహకారం అందజేస్తున్నామని తెలిపారు. వాటిలో మూడు అడ్వాన్స్‌డ్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని వివరించారు.

మరో నాలుగు వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ దశలో ఉన్నాయని వివరించారు. దరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌, అహ్మదాబాద్‌లోని జైడస్‌ క్యాడిలా వంటి సంస్థల పరిశోధకుల కృషిని, వారు సాధిస్తోన్న విజయాలను కేంద్ర ప్రభుత్వం పర్యవేక్షిస్తోందని ఆయన చెప్పారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ- ఆస్ట్రాజెన్‌కా టీకా ప్రయోగాలు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో కొనసాగుతున్నాయని తెలిపారు.

దేశంలో వైరస్ నియంత్రణకు అనేక చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. కరోనా వైరస్ గురించి జనవరి 30న హెచ్చరించింది.. అంతకు ముందే జనవరి 8నే భారత్ కార్యాచరణ ప్రారంభించిందని అన్నారు. జనవరి 17న వైరస్ వ్యాప్తి గురించి ఆరోగ్య సూచనలు జారీచేశామని, జనవరి 30 దేశంలో తొలి కేసు నమోదయ్యిందని డాక్టర్ హర్ష్‌వర్దన్ అన్నారు. ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా 63.7 మిలియన్ల మందికి పరీక్షలు చేశామని, దాదాపు ప్రపంచంలో ఇదే అధికమని అన్నారు.

ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖకు దేశీయంగా వెంటిలేటర్ల ఉత్పత్తికి ప్రధాని సహాయ నిధి నుంచి రూ.893.93 కోట్ల నిధులు అందాయని తెలిపారు. అలాగే, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నిధులు రూ.11,000 కోట్లను ఆన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకున్నాయన్నారు. దేశవ్యాప్తంగా 17,000 కోవిడ్ కేర్ కేంద్రాల్లో 1.8 మిలియన్ బెడ్‌లు, 13,000 క్వారంటైన్ సెంటర్లలో ఆరు లక్షల పడకలు అందుబాటులో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.





Untitled Document
Advertisements