స్టాక్ మార్కెట్: రైతుల దెబ్బకి కుప్పకూలిన సూచీలు!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 04:42 PM

స్టాక్ మార్కెట్: రైతుల దెబ్బకి కుప్పకూలిన సూచీలు!

దేశీ స్టాక్ మార్కెట్ పేకమేడలా కూలిపోయింది. సోమవారం బెంచ్‌మార్క్ సూచీలు పతనమయ్యాయి. ఈక్విటీ మార్కెట్ నష్టపోవడం ఇది వరుసగా మూడో రోజు. అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాల వెల్లువెత్తాయి. మరీముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన ఫామ్ బిల్లు 2020పై దేశవ్యాప్తంగా నిరసనలు వెలువెత్తడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ దెబ్బతింది. అంతేకాకుండా కోవిడ్ 19 కేసులు కూడా పెరిగిపోవడం, బలహీన అంతర్జాతీయ సంకేతాల వల్ల సూచీలపై మరింత ప్రతికూల ప్రభావం చూపింది.

ఇంట్రాడేలో బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా 907 పాయింట్లు కుప్పకూలింది. 37,938 పాయింట్ల కనిష్టానికి క్షీణించింది. నిఫ్టీ కూడా కీలకమైన 12,500 పాయింట్ల కిందకు పడిపోయింది. చివరకు సెన్సెక్స్ 812 పాయింట్ల నష్టంతో 38,034 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 254 పాయింట్ల నష్టంతో 11,250 పాయింట్ల వద్ద క్లోజయ్యాయి.

✺ నిఫ్టీ 50లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా బ్యాంక్ షేర్లు లాభపడ్డాయి.

✺ అదేసమయంలో ఇండస్ఇండ్ బ్యాంక్, టాటా మోటార్స్, హిందాల్కో, టాటా స్టీల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేర్లు నష్టపోయాయి. ఇండస్ఇండ్ బ్యాంక్ ఏకంగా 9 శాతం పతనమైంది.

✺ నిఫ్టీ‌ సెక్టోరల్ ఇండెక్స్‌లన్నీ నష్టాల్లోనే క్లోజయ్యాయి. నిఫ్టీ బ్యాంక్ 3 శాతం, నిఫ్టీ ఆటో 4 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 2 శాతం, నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 3 శాతం, నిఫ్టీ ఐటీ 0.7 శాతం, నిఫ్టీ మీడియా 5 శాతం, నిఫ్టీ మెటల్ 5.5 శాతం, నిఫ్టీ ఫార్మా 4.4 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ 4.3 శాతం, నిఫ్టీ ప్రైవేట్ బ్యాంక్ 3.7 శాతం చొప్పున కుప్పకూలాయి.

✺ అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి లాభపడింది. 7 పైసలు లాభంతో 73.38 వద్ద క్లోజయ్యింది.

✺ అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ (ముడి చమురు) ధరలు తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.2 శాతం తగ్గుదలతో 42.21 డాలర్లకు క్షీణించింది. డబ్ల్యూటీఐ క్రూడ్ ధర బ్యారెల్‌కు 2.37 శాతం క్షీణతతో 40.33 డాలర్లకు తగ్గింది.





Untitled Document
Advertisements