ఓటీటీలో శర్వానంద్ లేటెస్ట్ సినిమా?

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 06:55 PM

ఓటీటీలో శర్వానంద్ లేటెస్ట్ సినిమా?

కరోనా వైరస్ కారణంగా ఆరు నెలలుగా థియేటర్లు మూతపడిన సంగతి తెలిసిందే. దీంతో షూటింగ్ పూర్తి చేసుకున్న చాలా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ఎదురుచూస్తున్నాయి. కొన్ని సినిమాలైతే ఓటీటీ ప్లాట్‌పామ్‌ ద్వారా విడుదలై సినీ అభిమానులను అలరించాయి. నాని, సుధీర్‌‌బాబు కాంబినేషన్లో వచ్చిన ‘వి’ సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌లో విడుదలై అందరినీ ఆకట్టుకుంది. అనుష్క తాజా సినిమా ‘నిశ్శబ్దం’ మూవీ త్వరలోనే ఓటీటీ ద్వారానే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ కోవలోనే శర్వానంద్ తాజా సినిమా కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్ ద్వారా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శర్వానంద్ ప్రస్తుతం ‘శ్రీకారం’ అనే సినిమాలో నటిస్తున్నాడు. కిశోర్‌ రెడ్డి దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రం శర్వానంద్ కెరీర్లో 29వది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపిచంద్ ఆచంట నిర్మిస్తున్నారు. శర్వానంద్‌ ఇందులో పల్లెటూరి కుర్రాడిగా నటిస్తున్నారు. పరిస్థితులన్నీ మంచిగా ఉండి ఉంటే ఇప్పటికే థియేటర్లలోకి వచ్చి ఉండేది. అయితే కరోనా కారణంగా విడుదలకు నోచుకోలేదు. ఈ సినిమా గురించి తాజాగా ఓ వార్త ప్రచారంలోకి వచ్చింది.

‘శ్రీకారం’ సినిమాను వచ్చే సంక్రాంతి బరిలో దించాలని నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే సంక్రాంతి బరిలో ఇప్పటికే అరడజను సినిమాలు రెడీగా ఉన్నాయి. దీంతో అన్ని సినిమాలతో పోటీ పడటం కంటే ‘వి’ బాటలో ఓటీటీ ద్వారా విడుదల చేస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయట. అక్టోబర్‌లో అనుష్క, రాజ్‌తరుణ్, సూర్య నటించిన మూడు సినిమాలు ఓటీటీలో విడుదల కానున్నాయి. అదే బాటలో ‘శ్రీకారం’ సినిమాను కూడా డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా విడుదల కానుందని ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్ర నిర్మాతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.





Untitled Document
Advertisements