కడుపులో ఉన్నదీ ఆడో, మగో చూసేందుకు.. భార్యను నిలువునా కోసి..!

     Written by : smtv Desk | Mon, Sep 21, 2020, 07:00 PM

కడుపులో ఉన్నదీ ఆడో, మగో చూసేందుకు.. భార్యను  నిలువునా కోసి..!

శతాబ్ధాలు దాటి, ఆధునికతలో ఎంత ముందంజలో ఉన్నా సమాజంలో ఆడపిల్లపై చిన్నచూపు ఇంకా కొనసాగుతోంది. ఆడపిల్లపై చిన్నచూపు, మగపిల్లాడిపై మోజులో కొందరు క్రూర మృగాల కంటే హీనంగా బరితెగిస్తున్నారు. తాజాగా, ఉత్తరప్రదేశ్‌లో ఒళ్లు జలదరించే.. మనుషుల మీద నమ్మకం పోయే దారుణమొకటి వెలుగులోకి వచ్చింది.

ఓ వ్యక్తి తన భార్య గర్భంలో ఉంది ఆడపిల్లో, మగ పిల్లాడో తెలుసుకునేందుకు ఏకంగా ఆమె పొట్ట చీల్చాడు. వింటేనే ఒళ్లు గగుడ్పొడిచే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని నేక్‌పూర్ అనే గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామంలో పన్నాలాల్ అనే వ్యక్తికి ఇప్పటికే ఐదుగురు కూతుళ్లు ఉన్నారు. కొడుకును కనాలనేది అతడి పట్టుదల. ఈ క్రమంలో అతడి భార్య మరోసారి గర్భవతి అయింది. ఈసారి కూడా ఆడపిల్ల పుడితే ఎలాగని ఆందోళన చెందిన పన్నాలాల్ విపరీత చర్యకు దిగాడు.

పొట్టలో ఉంది ఆడో, మగో తెలుసుకునేందుకు ఓ పదునైన వస్తువుతో భార్య పొట్ట చీల్చాడు. భర్త విపరీత చర్యకు ఆ గర్భవతి తల్లడిల్లిపోయింది. తీవ్ర రక్తస్త్రావంతో విలవిల్లాడిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను బరేలీలోని ఆస్పత్రికి ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

కొడుకు పుట్టాలని కోరుకుంటున్న పన్నాలాల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు పన్నాలాల్‌ను అరెస్ట్ చేశారు.





Untitled Document
Advertisements