రోడ్డు ప్రమాదంలో మృతి: 8మందికి అవయువాలు దానం

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 11:48 AM

రోడ్డు ప్రమాదంలో మృతి: 8మందికి అవయువాలు దానం

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన ఓ యువకుడు మరో ఎనిమిది మందికి ప్రాణ దాతగా నిలిచాడు. అనేక రకాల సమస్యలతో బాధపడుతున్న ఎనిమిది మందికి తన అవయువాల్ని దానం చేసి కొత్త జీవితాన్ని ప్రసాదించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా రాజపూర్‌ మండలం రంగారెడ్డిగూడ సింగమగూడ తండాకు చెందిన విస్లావత్‌ కుమార్ ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు. కుటుంబానికి ఆర్థికంగా ఆసరాగా ఉండేందుకు చిన్న చిన్న పనులు చేసేవాడు.

ఈ నెల 18న బైకుపై ఇంటికి వెళ్తుండగా వాహనం అదుపు తప్పి కిందపడిపోయి గాయపడ్డాడు. దీంతో అతడ్ని స్థానిక ఆసుపత్రికి తరలించారు.తలకు బలమైన గాయం కావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని కొండాపూర్‌ కిమ్స్‌ ఆసుపత్రికి తీసుకొచ్చారు. 26 గంటలపాటు వైద్యం అందించిన డాక్టర్లు కుమార్ బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు నిర్ధారించారు. ఈ విషయం తెలుసుకున్న జీవన్‌దాన్‌ ప్రతినిధులు వెంటనే కిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నాడు.

కుమార్ కుటుంబసభ్యుల్ని కలిశారు. అతని‌ తల్లి మారు, సోదరుడు రాజేష్‌లకు అవయవ దానంపై కౌన్సెలింగ్‌ చేశారు. దీంతో వారు కుమార్ అవయువాలు దానం చేసేందుకు అంగీకరించారు. అతని నుంచి గుండె, కిడ్నీలు, కాలేయం, ఊపిరితిత్తులు, నేత్రాలు సేకరించి.. 8 మందికి మార్పిడి చేసినట్లు నిమ్స్‌ జీవన్‌దాన్‌ ఇన్‌ఛార్జి స్వర్ణలత వెల్లడించారు. అవయువ దానం చేయడం వల్ల మరొకరి జీవితం నిలబెట్టిన వారవుతారని ఆమె పేర్కొన్నారు. కుమార్ కుటుంబసభ్యులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.





Untitled Document
Advertisements