ఉమేశ్ పై ట్రోల్స్... కోహ్లీని ఉతికారేస్తున్న ఫ్యాన్స్

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 12:41 PM

ఉమేశ్ పై ట్రోల్స్... కోహ్లీని ఉతికారేస్తున్న ఫ్యాన్స్

ఐపీఎల్ 2020 సీజన్‌ని అనూహ్య విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆరంభించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో దుబాయ్ వేదికగా సోమవారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (61: 43 బంతుల్లో 6x4, 2x6) దెబ్బకి తొలుత చేతులు ఎత్తేసిన బెంగళూరు బౌలర్లు.. ఆఖర్లో అనూహ్యంగా పుంజుకుని వరుస వికెట్లు పడగొట్టేశారు. చాహల్, శివమ్ దూబే, నవదీప్ సైనీ బెంగళూరుని గెలిపించేందుకు పొదుపుగా బౌలింగ్ చేసినా.. ఫాస్ట్ బౌలర్ ఉమేశ్ యాదవ్ ధారాళంగా పరుగులిచ్చేస్తూ ఆ టీమ్‌ శిబిరాన్ని కంగారుపెట్టాడు. మ్యాచ్‌లో 4 ఓవర్లు వేసిన ఉమేశ్ ఏకంగా 48 పరుగులివ్వడంతో.. అభిమానులు అతనిపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సెటైర్లు పేలుస్తున్నారు.

ఐపీఎల్ 2019 సీజన్‌లో కనీసం ప్లేఆఫ్‌కి కూడా అర్హత సాధించలేకపోయిన బెంగళూరు టీమ్.. పాయింట్ల పట్టికలోనూ చిట్టచివరి స్థానంలో నిలిచింది. కానీ.. తాజా సీజన్ ఫస్ట్ మ్యాచ్‌లో 10 పరుగుల తేడాతో గెలిచిన బెంగళూరు.. పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి దూసుకెళ్లింది. దాంతో.. ఆ పట్టికని చూస్తూ అభిమానులు ఎమోషనల్ అయిపోతున్నారు. ఇందులో విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ, చాహల్‌కి కాబోయే భార్య ధన్యశ్రీ వర్మ కూడా ఉన్నట్లు అభిమానులు మీమ్స్ తయారు చేస్తున్నారు. ఇక కెప్టెన్ కోహ్లీ 13 బంతులాడినా కనీసం ఒక్క బౌండరీ కూడా కొట్టకుండా 14 పరుగులకే ఔటైపోయాడు.

మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ.. ఏబీ డివిలియర్స్ (51: 30 బంతుల్లో 4x4, 2x6), దేవదూత్ పడిక్కల్ (56: 42 బంతుల్లో 8x4) హాఫ్ సెంచరీలు బాదడంతో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో ఓపెనర్ జానీ బెయిర్‌స్టో (61: 43 బంతుల్లో 6x4, 2x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో హైదరాబాద్ అలవోక విజయాన్ని అందుకునేలా కనిపించింది. కానీ.. జట్టు స్కోరు 121 వద్ద బెయిర్‌స్టో ఔటవగా.. ఆ తర్వాత వరుసగా వికెట్లు చేజార్చుకున్న హైదరాబాద్ 19.4 ఓవర్లలో 153 పరుగులకి ఆలౌటైంది.





Untitled Document
Advertisements