సరిహద్దులో 6 కీలక ప్రాంతాలు స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 02:17 PM

సరిహద్దులో 6 కీలక ప్రాంతాలు స్వాధీనం చేసుకున్న ఇండియన్ ఆర్మీ

చైనా సరిహద్దులో భారత బలగాలు ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. లైన్ ఆఫ్ యాక్చ్యువల్ కంట్రోల్ వెంట 6 ఎత్తైన ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నాయి. కేవలం 3 వారాల్లోనే ఈ ఘనత సాధించడం విశేషం. స్వాధీనం చేసుకున్న ఈ 6 ప్రాంతాలు భౌగోళికపరంగా అత్యంత కీలకమైనవి, వ్యూహాత్మకమైనవని ప్రభుత్వ వర్గాలు తెలిపినట్లు న్యూస్ ఏజెన్సీ ఏఎన్‌ఐ తెలిపింది. అంతేకాదు.. వీటిలో రెండు కొండ ప్రాంతాలు ప్రధానంగా చైనా భూభాగంలోనే ఉండగా.. భారత భూభాగంలోని ఎత్తైన ప్రాంతంలో మన బలగాలు పాగా వేశాయి.

తూర్పు లఢక్ సెక్టార్‌లో చైనాతో ఘర్షణ వాతావరణం కొనసాగుతండగా భారత ఆర్మీ క్రమంగా వ్యూహాత్మక ప్రాంతాలను తన ఆధీనంలోకి తెచ్చుకుంటోంది. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ రెండో వారం వరకు సరిహద్దులో కీలకమైన ఆరు ఎత్తైన ప్రాంతాలను భారత ఆర్మీ స్వాధీనం చేసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వీటిలో మగర్ హిల్, గురుంగ్ హిల్, రెచెన్ లా, రెజాంగ్ లా, మోఖ్‌పారి ఉన్నాయి. ఇవన్నీ కీలకమైన ఫింగర్ 4 పాయింట్ సమీపంలోని పర్వత ప్రాంతాలే కావడం విశేషం.

గల్వాన్ ఘర్షణ అనంతరం చైనా బలగాలు ఈ ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించాయి. అయితే.. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్‌ఏ) జవాన్లకు ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఇండియన్ ఆర్మీ వీటిని స్వాధీనం చేసుకుంది.

పాంగాంగ్ సరస్సు ఉత్తరం నుంచి దక్షిణం వరకు వ్యూహాత్మంగా ఉన్న ఈ ప్రాంతాలను ఆక్రమించేందుకు చైనా సైనికులు ఇటీవల ప్రయత్నించి భారత్ చేతిలో ఖంగు తిన్న సంగతి తెలిసిందే. కేవలం రెండు గంటల్లోనే ఎత్తైన ప్రాంతానికి చేరుకున్న భారత బలగాలు పీఎల్‌ఏ సైనికులకు షాక్ ఇచ్చాయి. ఈ సందర్భంగా ఇరు దేశాల సైనికుల మధ్య మరోసారి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. చైనా జవాన్లు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. గాల్లోకి కాల్పులు జరిపారు. అయినా.. భారత బలగాలు అదరలేదు, బెదరలేదు. ఆ తర్వాత చైనా బలగాలకు తోక ముడవక తప్పలేదు.

మరోవైపు.. భారత బలగాలు కొత్తగా ఆరు ఎత్తైన ప్రాంతాలను స్వాధీనం చేసుకోవడంతో చైనా అగ్గిగుగ్గిలమవుతోంది. ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. రెచెన్ లా, రెజాంగ్ లా ప్రాంతాల వద్ద చైనా 3 వేల అదనపు బలగాలను మోహరించినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి.





Untitled Document
Advertisements