'కరోనా వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే దారుణ పరిణామాలు'

     Written by : smtv Desk | Tue, Sep 22, 2020, 05:52 PM

'కరోనా వ్యాక్సిన్ లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే దారుణ పరిణామాలు'

దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే దారుణమైన పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రజలు పెద్ద సంఖ్యలో వైరస్‌ బారినపడే అవకాశం ఉందని.. భారీ ఎత్తున మరణాలు సంభవించే ప్రమాదం ఉందని పేర్కొంది. కొవిడ్-19 మహమ్మారిని ఎదుర్కోవడానికి కచ్చితమైన ఔషధాలు లేకుండా హెర్డ్ ఇమ్యూనిటీకి ప్రయత్నిస్తే పరిణామాలు దారుణంగా ఉంటాయని తెలిపింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే ఆదివారం (సెప్టెంబర్ 20) రాజ్యసభలో తెలిపారు.

‘కరోనా వైరస్‌ విజృంభణ ప్రారంభమైన సమయంలో కొన్ని దేశాలు హెర్డ్‌ ఇమ్యూనిటీ దిశగా ప్రయత్నించాయి. దీంతో అక్కడ భారీ సంఖ్యలో ప్రజలు వైరస్‌ బారినపడటమే కాకుండా అధిక సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నట్లు తేలింది. దీంతో మనదేశంలో అలాంటి వ్యూహాన్ని వదిలివేశాం’ అని మంత్రి అశ్వినీ కుమార్‌ చౌబే పేర్కొన్నారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు‌ ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ కోసం రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయా? అని సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.

ప్రజలందరినీ వైరస్ బారినపడేసి ఇమ్యూనిటీ సాధించే ప్రక్రియను హెర్డ్ ఇమ్యూనిటీ అంటారు. దేశంలో కరోనా వైరస్ విషయంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించాలంటే ప్రజలందరినీ వైరస్‌ బారిన పడేలా చేయాల్సి ఉంటుంది. సాధారణ ప్రక్రియలో హెర్డ్‌ ఇమ్యూనిటీ సాధించడమనేది ఇప్పటివరకు పరిశోధనల్లో నిరూపితం కాలేదు. ఈ నేపథ్యంలో దేశంలో హెర్డ్‌ ఇమ్యూనిటీ ప్రక్రియను పక్కకు పెట్టి, కేవలం వైరస్‌ వ్యాప్తిని నియంత్రించడమే లక్ష్యంగా చర్యలు చేపట్టినట్లు కేంద్రం తెలిపింది.

అయితే.. హెర్డ్ ఇమ్యూనిటీ కోసం అనుసరించాల్సిన ప్రణాళికలు, సూచనలతో పాటు ప్రామాణిక పద్ధతుల (SoP)ను అన్ని రాష్ట్రాలకు తెలిపామని కేంద్ర మంత్రి అశ్వినీ కుమార్ చౌబే వెల్లడించారు. కరోనా వైరస్‌ తీవ్రతను ఎప్పటికప్పుడు అంచనా వేయడంతో పాటు వైరస్‌ నిర్ధారణ పరీక్షల కోసం దేశవ్యాప్తంగా 1768 పరీక్ష కేంద్రాలకు అనుమతి ఇచ్చినట్లు తెలిపారు.

దేశంలో కరోనా వ్యాక్సిన్ల స్టేటస్
దేశంలో ఇప్పటికే సుమారు 30 వ్యాక్సిన్ల ప్రయోగాలు వివిధ దశలో ఉన్నాయని పేర్కొంది. వీటిలో మూడు వ్యాక్సిన్లు మూడు దశల్లో ఉన్నాయని.. మరో నాలుగు ప్రీ-క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తి చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నాయని కేంద్రం తెలిపింది.





Untitled Document
Advertisements