ప్రియుని మోజులో పడి ఏకంగా భర్తను దారుణంగా హత్య చేసింది భార్య. ఈ ఘటన అనంతపురం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే…జిల్లాలోని దొడగట్ట గ్రామానికి చెందిన శ్రీనివాస్ చౌదరికి 9 సంవత్సరాల కింద సరిత అనే మహిళతో వివాహమైంది. వీరికి 7 సంవత్సరాల కూతురు కూడా ఉంది. సరితకు అదే గ్రామానికి చెందిన ప్రభాకర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయం శ్రీనివాస్ కు తెలిసి భార్యను ప్రవర్తన మార్చుకోవాలని సూచించాడు. భార్య ప్రవర్తన నచ్చని శ్రీనివాస్ మద్యానికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యభర్తలకు గొడవలు జరిగేవి. ఆదివారం మరోసారి భర్త తాగి రావడంతో సరిత అతనితో గొడవపడింది. మద్యం మత్తులో ఉన్న అతని పై పప్పు కాడతో తలపై కొట్టింది. దీంతో శ్రీనివాస్ అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత హత్యని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. శ్రీనివాస్ శవాన్ని చెట్టుకు ఉరేసి ఆత్మహత్య చేసుకున్నాడని నమ్మించే ప్రయత్నం చేసింది. ప్రియుడు ప్రభాకర్ తో కలిసి కోడలు సరిత తన కుమారున్ని హత్య చేసిందని శ్రీనివాస్ తండ్రి రామచంద్రప్ప పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులకు అసలు విషయం తెలిసింది. ప్రస్తుతం ఆ నిందితులిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.