తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల హడావుడి నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలంతా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఈ సారి సీఎం కేసీఆర్ కాస్త రూట్ మార్చినట్టు టాక్ వినిపిస్తుంది. ఈ సారి టికెట్ను పార్టీ నాయకులకు కాకుండా తెలంగాణ ఉద్యమకారులకే అవకాశం ఇవ్వాలని కేసీఆర్ యోచిస్తున్నట్టు సమాచారం.
అయితే ప్రజాగాయకుడు, ప్రస్తుతం సీఎం ఓఎస్డీగా ఉన్న దేశపతి శ్రీనివాస్ పేరు జాబితాలో ప్రముఖంగా వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తెలంగాణ మేధావిగా పేరుగాంచిన ప్రొఫెసర్ నాగేశ్వర్కు కూడా మద్దతిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మరో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి మర్రి రాజశేఖర్ రెడ్డికి అవకాశం ఇస్తున్నట్టు తెలుస్తుంది. ప్రొఫెసర్ నాగేశ్వర్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. అయితే నాగేశ్వర్ కు పోటీగా టీఆర్ఎస్ నుంచి పోటీకి నిలబెట్టకుండా, ఆయనకు మద్దతివ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.