తెలంగాణలో రెవెన్యూ చట్టంలో మార్పులు తెచ్చేందుకు కొత్త రెవెన్యూ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు సేఎం కేసీఆర్ ఇదివరకే ప్రకటించారు. ఈ క్రమంలో ధరణి పోర్టల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తుంది. తహశీల్దార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల సేవలను వచ్చే నెల నుంచి అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.
అయితే సాంకేతిక, మౌలిక వసతుల కల్పనకు ఒక్కో తహశీల్దార్ కార్యాలయానికి ప్రభుత్వం 10 లక్షలను కేటాయించింది. ధరణి పోర్టల్ నిర్వహణకు వీలుగా తహశీల్దార్ కార్యాలయాల్లో సదుపాయాలు ఏర్పాటు చేయాలని సీఎస్ సోమేశ్కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. నిన్న ధరణి సేవలపై అధికారులతో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్ పలు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటివరకు నమోదు కాని వ్యవసాయేతర ఆస్తుల వివరాలను 15 రోజుల్లోగా ఆన్లైన్లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. పోర్టల్ నిర్వహణ, ఇతర శాఖలకు అనుసంధానంలో ఉన్న సమస్యలను తొలగించేందుకు ఏర్పాట్లను ముమ్మరం చేశారు.