కరోనా టీకాను అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 01:11 PM

కరోనా టీకాను అభివృద్ధి చేసిన జాన్సన్ అండ్ జాన్సన్

కరోనా వైరస్‌ను కట్టడి చేసే బ్రహ్మాస్త్రం కోసం ప్రపంచవ్యాప్తంగా ముమ్మర పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ ప్రయోగాల్లో కొన్ని తుది దశకు చేరుకోగా.. ఇప్పటికే రష్యా ఓ వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తాజాగా, ప్రముఖ ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్ ఈ జాబితాలో చేరింది. ఒక్క డోసుతో కరోనా మహమ్మారిని అంతం చేసే సామర్థ్యం గల వ్యాక్సిన్‌ను తీసుకొచ్చేందుకు కృషి చేస్తోంది.

ప్రస్తుతం ఈ వ్యాక్సిన్ ప్రయోగాలు తుది దశకు చేరుకోగా, అమెరికా, అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, కొలంబియా, మెక్సికో, పెరూలోని 215 చోట్ల మొత్తం 60 వేల మంది వాలంటీర్లపై ప్రయోగించనున్నారు. మంచి ఫలితం రావాలంటే ఏదైనా టీకాను కనీసం రెండుసార్లు ఇవ్వాల్సి ఉంటుంది, కానీ ఒకే ఒక్క డోసుతో కరోనా నుంచి రక్షణ కల్పించే వ్యాక్సిన్‌ను తాము అభివృద్ధి చేసినట్టు జాన్సన్ అండన్ జాన్సన్ అధికారి ఒకరు తెలిపారు.

ఎబోలాకు ఈ విధంగానే తాము వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేశామని, ప్రస్తుతం అదే సాంకేతికతను వినియోగించినట్టు పేర్కొన్నారు. కోవిడ్ -19 వైరస్ జన్యు మార్పిడి ద్వారా సాధారణ జలుబుకు కారణమయ్యే అడినో వైరస్‌‌తో కలిసి టీకా రూపొందించినట్టు పేర్కొంది. తాము అభివృద్ధిచేసిన టీకా ఒక్క డోసుతోనే వైరస్‌ను కట్టడిచేసిందని జాన్సన్ అండ్ జాన్సన్ ప్రకటించిందని, అదే నిజమైతే ఎంతో ప్రయోజనం కలుగుతుందని అమెరికా అంటువ్యాధుల పరిశోధకుడు డాక్టర్ ఆంథోనీ ఫౌచీ అన్నారు.

అయితే, ఇప్పటి వరకు తొలి దశ క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను జాన్సన్ అండ్ జాన్సన్ వెల్లడించలేదు. కానీ, ఆ సంస్థకు చెందిన చీఫ్ సైంటిస్ట్ పాల్ స్టియోఫెల్ మంగళవారం మాట్లాడుతూ.. జంతువులు, మనుషుల్లోనూ ఒకే విధమైన వ్యాధినిరోధకత చూపిందని, వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత జ్వరం వంటి లక్షణాలు రెండు రోజుల్లోనే తగ్గిపోయాయని అన్నారు.





Untitled Document
Advertisements