ఐపీఎల్: ఇంజ్యూరీ ప్రీమియర్ లీగ్!

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 03:08 PM

ఐపీఎల్: ఇంజ్యూరీ ప్రీమియర్ లీగ్!

ఐపీఎల్ 2020లో ఇప్పటి వరకూ ఐదు మ్యాచ్‌లో జరిగాయి. కానీ ఇప్పటికే చాలా మంది ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. లాక్‌‌డౌన్ ఎఫెక్ట్‌తో చాలా మంది ఆటగాళ్లు ప్రాక్టీస్‌కు దూరమయ్యారు. నెలల తరబడి ఆటకు దూరంగా ఉండాల్సి రావడంతో గాయాల బారిన పడుతున్నారు. లాక్‌డౌన్ మానసిక సన్నద్ధతపైనా ప్రభావం చూపుతోంది. ఈ ఐపీఎల్‌లో ఇప్పటి వరకూ గాయాల బారిన పడిన ఆటగాళ్ల వివరాలు చూద్దాం..

బెంగళూరుతో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన సన్‌రైజర్స్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్... టోర్నీకి దూరమయ్యాడు. అతడి స్థానంలో జాసన్ హోల్డర్‌ను జట్టులోకి తీసుకుంటున్నట్లు ఫ్రాంచైజీ ప్రకటించింది. ఆర్సీబీతో తొలి మ్యాచ్‌కు ముందే ట్రైనింగ్ సెషన్లో విలియమ్సన్‌కు కండరాలు పట్టేశాయి. ఈ విషయాన్ని టాస్ సమయంలో డేవిడ్ వార్నర్ వెల్లడించాడు. విలియమ్సన్ త్వరలోనే కోలుకోవాలని సన్‌రైజర్స్ కోరుకుంటోంది.

ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో సత్తా చాటిన రాయుడు.. ముంబైపై చెన్నై సూపర్ కింగ్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కానీ తొడ నరాలు పట్టేయడంతో రాజస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌కు దూరమయ్యాడు. రాయుడు మరో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

సెప్టెంబర్ 10న కరేబియన్ ప్రీమియర్ లీగ్ ఫైనల్‌కు ముందు డ్వేన్ బ్రావో మోకాలికి గాయమైంది. బ్రావో ఆ మ్యాచ్ ఆడినప్పటికీ బౌలింగ్ చేయలేదు. గాయం కారణంగా చెన్నై సూపర్ కింగ్స్ తొలి రెండు మ్యాచ్‌లకు బ్రావో దూరమయ్యాడు. దీంతో సామ్ కర్రాన్‌ను అతడి బదులు ఆడించారు. మరో ఒకటి లేదా రెండు మ్యాచ్‌లకు బ్రావో దూరమయ్యే అవకాశం ఉంది.

పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తొలి ఓవర్లోనే రెండు వికెట్లు తీసిన ఢిల్లీ క్యాపిటల్స్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్.. అదే ఓవర్లో బంతిని ఆపబోయి కింద పడ్డాడు. దీంతో అశ్విన్ భుజానికి గాయమైంది. తీవ్ర నొప్పితో అశ్విన్ మైదానాన్ని వదిలాడు. నొప్పి తగ్గిందని.. స్కానింగ్‌లోనూ ఆశాజనకమైన ఫలితాలు వస్తున్నాయని అనంతరం అశ్విన్ ట్వీట్ చేశాడు. చెన్నైతో మ్యాచ్‌‌లోగా అశ్విన్ గాయం నుంచి కోలుకుంటాడని ఢిల్లీ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తెలిపాడు.

పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు ఢిల్లీ పేసర్ ఇషాంత్ శర్మ గాయపడ్డాడు. దీంతో అతడు తొలి మ్యాచ్‌కు దూరమయ్యాడు. మరి కొన్ని మ్యాచ్‌ల్లోనూ అతడు ఆడే అవకాశాల్లేవ్. అతడి గాయం తీవ్రత గురించి అప్‌డేట్ లేదు.

సన్‌రైజర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఆల్‌రౌండర్ క్రిస్ మోరిస్ తుది జట్టులో లేకపోవడం ఆశ్చర్యపరిచింది. ట్రైనింగ్ సమయంలో అతడు సైడ్ స్ట్రెయిన్‌ (పక్క భాగం పట్టేయడం) బారిన పడ్డాడని తర్వాత తెలిసింది. మరో రెండు మ్యాచ్‌ల్లో మోరిస్ ఫిట్‌గా మారతాడని ఆశిస్తున్నట్లు ఆర్సీబీ క్రికెట్ డైరెక్టర్ మైక్ హెస్సన్ తెలిపారు.

సైడ్ స్ట్రెయిన్ కారణంగానే నాథన్ కౌల్టర్ నైల్ ముంబై ఆడిన తొలి రెండు గేమ్‌లకు దూరమయ్యాడు. అతడు కోలుకోవడానికి సమయం పట్టే అవకాశం ఉంది. జేమ్స్ పాటిన్సన్ రాణించడంతో ముంబై అతడి విషయంలో తొందర పడకపోవచ్చు.

ఐపీఎల్ ఆరంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ పేసర్ హ్యారీ గర్నీ గాయపడ్డాడు. దీంతో అతడి స్థానంలో అమెరికా ఆటగాడు అలీ ఖాన్‌ను జట్టులోకి తీసుకున్నారు. కానీ తొలి మ్యాచ్ ఆడే అవకాశం అతడికి దక్కలేదు.





Untitled Document
Advertisements