తెలంగాణ ఆర్టీసీ శుభవార్త: హైదరాబాద్‌లో రేపట్నుంచి సిటీ బస్సులు ప్రారంభం

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 05:00 PM

తెలంగాణ ఆర్టీసీ శుభవార్త: హైదరాబాద్‌లో రేపట్నుంచి సిటీ బస్సులు ప్రారంభం

హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ ఆర్టీసీ శుభవార్త చెప్పింది. రేపట్నుంచి నగరంలో సిటీ బస్సులు తిప్పేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో కరోనా కరాణంగా గత ఆరు నెలలుగా డిపోలకే పరిమితమైన సిటీ బస్సులు శుక్రవారం నుంచి రోడ్డెక్కనున్నాయి. ఇప్పటికే బుధవారం నుంచి నగర శివార్లలోని బస్సులను ఇతర ప్రాంతాలకు పాక్షికంగా తిప్పుతున్నారు అధికారులు. అయితే శుక్రవారం నుంచి పూర్తి స్థాయిలో నగరవ్యాప్తంగా బస్సులు నడుపనున్నట్లు ఆర్టీసీ వర్గాల ద్వారా తెలిసింది.

అయితే కరోనా కారణంగా బస్సుల్లో ప్రయాణించే వారు భౌతిక దూరం పాటించేలా ఏర్పాట్లు చేశారు. సాధారణంగా సిటీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇక నుంచి ఆ పరిస్థితి ఉండకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గ్రేటర్‌లో 3798 ఆర్టీసీ బస్సులున్నాయి. ఐతే గతేడాది సమ్మె కారణంగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా కొన్ని బస్సు సర్వీసులను పక్కనబెట్టారు. అయితే పరిమిత సంఖ్యలో మాత్రం బస్సుల్ని నడిపేందుకు సిద్ధమవుతున్నారు.

కరోనా భయంతో చాలామంది పబ్లిక్ ట్రాన్స్ పోర్టుల్ని వాడటం లేదు. కేవలం తమ సొంత వాహనాలను మాత్రమే బయటకు వెళ్లేందుకు వినియోగిస్తున్నారు. అయితే కొందరు చిరు ఉద్యోగులు, రోజువారి పనుల కోసం వెళ్లేవారు మాత్రం సిటీ ఆర్టీసీ సర్వీసుల కోసం ఎదురు చూస్తున్నారు. నగరంలో సిటీ బస్సులు తిరగడం ప్రారంభం అయితే.. తమకు ప్రైవేటు వాహనాలు ఎక్కి అధిక డబ్బులు చెల్లించే అవసరం ఉండదని చెబుతున్నారు. ఏది ఏమైనా సిటీ బస్సుల సర్వీసులు ప్రారంభం కావడంతో నగరవాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements