రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపే తొలి మహిళా పైలట్‌గా శివంగి సింగ్

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 06:02 PM

రాఫెల్ ఫైటర్ జెట్‌ను నడిపే తొలి మహిళా పైలట్‌గా శివంగి సింగ్

రాఫెల్ యుద్ధ విమానాల రాకతో భారత వైమానిక దళం సామర్థ్యం మరింత పెరిగిన విషయం తెలిసిందే. వాయుసేన (ఐఏఎఫ్‌) అమ్ములపొదిలోకి రాఫెల్‌ యుద్ధ విమానాలు చేరడం ఓ విశేషం కాగా.. ఈ అత్యాధునిక ఫైటర్ జెట్లను నడిపేందుకు ఓ మహిళా పైలట్ సిద్ధమయ్యారు. రాఫెల్ యుద్ధ విమానాన్ని నడిపే తొలి మహిళా పైలట్‌గా ఫ్లైట్ లెఫ్టినెంట్ శివంగి సింగ్ ఘనత దక్కించుకోనున్నారు. వింగ్‌ కమాండర్‌ అభినందన్‌ వర్ధమాన్‌ (గత ఏడాది పాక్ యుద్ధ విమానాన్ని వెంబడిస్తూ ఆ దేశ సైన్యానికి చిక్కి కొన్ని రోజుల తర్వాత విడుదలైన ఇండియన్ హీరో)తో కలిసి ఆమె యుద్ధ విమానంలో అంబాలా ఎయిర్ బేస్‌కు చేరుకున్నారు.

మిగ్ -21 బైసన్‌ యుద్ధ విమానాలు నడిపిన అనుభవం శివంగి సింగ్‌ సొంతం. వారణాసికి చెందిన శివంగి సింగ్ 2017లో ఐఏఎఫ్‌లో చేరారు. మహిళల ఫైటర్‌ పైలట్‌ శిక్షణకు సంబంధించిన రెండో బ్యాచ్ అభ్యర్థిగా ట్రెయినింగ్ తీసుకున్నారు. అతి త్వరలో ఆమె అంబాలాలోని 17 స్క్వాడ్రన్‌కు చెందిన రాఫెల్‌ ‘గోల్డెన్ యారో‌స్‌’లో భాగం కానున్నారు. ఇందు కోసం ఆమె ప్రత్యేక శిక్షణ పొందుతున్నారు.

శివంగి సింగ్.. వారణాసిలో ప్రాథమిక విద్య, బనారస్‌ హిందూ యూనివర్సిటీలో ఉన్నత విద్య పూర్తి చేశారు. 7 యూపీ ఎయిర్‌ స్క్వాడ్రన్‌లో ఎన్‌సీసీ క్యాడెట్‌గా ఉన్న శివంగి.. 2016 నుంచి ఎయిర్‌ ఫోర్స్‌ అకాడమీలో శిక్షణ పొందారు.





Untitled Document
Advertisements