బీజేపీకి షాకిచ్చిన జనసేన!

     Written by : smtv Desk | Thu, Sep 24, 2020, 06:04 PM

బీజేపీకి షాకిచ్చిన జనసేన!

అమరావతి వ్యవహారంపై జనసేన పార్టీ దూకుడు పెంచింది. రాజధాని నగరంగా అమరావతికి కట్టుబడి ఉన్నట్లు తేల్చి చెప్పింది. ఏపీ ప్రభుత్వ మూడు రాజధానుల విధానాన్ని వ్యతిరేకిస్తున్నామని.. ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, 13 జిల్లాల సమగ్రాభివృద్ధే తమ వైఖరని క్లారిటీ ఇచ్చింది. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ తరఫున ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి టి.శివశంకరరావు ఏపీ హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేశారు.

ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలి.. ప్రతీకారం, ద్వేషంతో సాగే పాలన, విభజించి పాలించే కుట్రలు సరికాదని అభిప్రాయపడింది. ఒకే రాజధానితో రాష్ట్రంలోని 13 జిల్లాలు అభివృద్ధి సాధించాలని.. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారంలోకి వచ్చిన పార్టీలు ప్రభుత్వ విధానాలు మార్చకూడదని వ్యాఖ్యానించింది. గత ప్రభుత్వ విధానాల్లో తప్పులు, అక్రమాలుంటే వాటిని సరిదిద్దేందుకు ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని.. కానీ విధానాలు మారిస్తే అభివృద్ధికి ఆటంకం కలుగుతుందని ప్రస్తావించింది. పాలనా వికేంద్రీకరణ చట్టం, సీఆర్‌డీఏ రద్దు చట్టాల్ని రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలని కోరింది.

అమరావతి ప్రాంతంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన వారిలో ఎక్కువమంది పేద, సన్నకారు రైతులు ఉన్నారని జనసేన అంటోంది. వారికి వేరే జీవనాధారం లేదని.. వారిలోనూ ఎక్కువ మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలే ఉన్నారని వివరించింది. అమరావతిని అభివృద్ధి చేస్తారని నమ్మి భూములు త్యాగం చేశారని ప్రస్తావించింది. మూడు రాజధానుల ప్రకటన తర్వాత పరిస్థితుల్ని వివరించి.. స్వార్థ, రాజకీయ ప్రయోజనాలకు అమరావతి అంశం వేదిక కావడం దురదృష్టకరమని.. అధికారంలో ఉన్నంత మాత్రాన నచ్చినట్లు నిర్ణయాలు తీసుకోవడానికి వీల్లేదని అభిప్రాయపడింది. మూడు రాజధానులు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుల ఆమోదం విషయంలో ప్రభుత్వం నిబంధనలను పాటించలేదని.. గవర్నర్‌ బిల్లులపై సంతృప్తి చెందినంత మాత్రాన న్యాయసమీక్షను నిలువరించలేరని వ్యాఖ్యానించింది.

అమరావతి రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారన్న విషయాన్ని జనసేన పార్టీ గుర్తు చేసింది. ప్రభుత్వం రైతులతో ఒప్పందం చేసుకుంది. దానికి చట్టబద్ధత ఉంది. రాజధానిని తరలించడం జనరల్‌ క్లాజ్‌ చట్టంలోని సెక్షన్‌ 6(బీ)(సీ)లకు విరుద్ధమంది. ప్రభుత్వం పౌరసమాజం, ప్రజలు, ప్రభుత్వ ఉద్యోగులను సంప్రదించకుండా మూడు రాజధానుల ఏకపక్ష నిర్ణయాన్ని తీసుకుందని.. ప్రాంతీయ విభేదాలు సృష్టించిందని అభిప్రాయపడింది. దీనిని కట్టడి చేయకపోతే ప్రత్యేక రాష్ట్రం, ప్రాంతాల వేర్పాటువాద ఉద్యమానికి దారితీస్తుందని వివరించింది. ఓవైపు బీజేపీ మూడు రాజధానులకు అభ్యంతరం లేదని చెబుతుంటే.. జనసేన మాత్రం ఒకే రాజధానికి కట్టుబడి ఉన్నామని అఫిడవిట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఓ విధంగా ఇది జనసేన మిత్రపక్షం బీజేపీకి షాక్ అనే చెప్పాలి.





Untitled Document
Advertisements