ఐపీఎల్ 2020 సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తడబాటు మొదలైంది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో దుబాయ్ వేదికగా బుధవారం రాత్రి జరిగిన మ్యాచ్లో బౌలింగ్, బ్యాటింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ తత్తరపాటుకి గురైన బెంగళూరు ఏకంగా 97 పరుగుల భారీ తేడాతో చిత్తుగా ఓడిపోయింది. తొలుత కెప్టెన్ కేఎల్ రాహుల్ (132 నాటౌట్: 69 బంతుల్లో 14x4, 7x6) అజేయ శతకంతో బాదడంతో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 3 వికెట్ల నష్టానికి ఏకంగా 206 పరుగులు చేసింది. అనంతరం ఛేదనలో బెంగళూరు టీమ్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఆ జట్టులో వాషింగ్టన్ సుందర్ (30: 27 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్కాగా.. ఏబీ డివిలియర్స్ (28: 18 బంతుల్లో 4x4, 1x6), అరోన్ ఫించ్ (20: 21 బంతుల్లో 3x4) కాసేపు క్రీజులో నిలిచారు. కానీ.. ఈ ఇద్దరి ఔట్ తర్వాత పేకమేడని తలపించిన బెంగళూరు 17 ఓవర్లలోనే 109 పరుగులకి ఆలౌటైంది. కెప్టెన్ కోహ్లీ (1) వరుసగా రెండో మ్యాచ్లోనూ తక్కువ స్కోరుకే ఔటైపోయాడు.