కోహ్లీకి రూ.12 లక్షలు జరిమానా

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 12:07 PM

కోహ్లీకి రూ.12 లక్షలు జరిమానా

ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీకి జరిమానా పడింది. కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో అబుదాబి వేదికగా గురువారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో 97 పరుగుల తేడాతో బెంగళూరు జట్టు ఓడిపోగా.. మ్యాచ్‌లో కేఎల్ రాహుల్ ఇచ్చిన రెండు సులువైన క్యాచ్‌లను విరాట్ కోహ్లీ జారవిడిచిన విషయం తెలిసిందే. దాంతో.. మ్యాచ్‌లో చెలరేగిపోయిన కేఎల్ రాహుల్ (132 నాటౌట్: 69 బంతుల్లో 14x4, 7x6) మెరుపు శతకంతో చివరి వరకూ అజేయంగా నిలవడమే కాకుండా పంజాబ్‌కి 206 పరుగుల భారీ స్కోరుని అందించాడు. కోహ్లీ ఫీల్డింగ్ తప్పిదాలే బెంగళూరు ఓటమికి కారణమని ఇప్పటికే అతనిపై అభిమానులు మండిపడుతుండగా.. తాజాగా స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద మ్యాచ్ రిఫరీ కోహ్లీకి జరిమానా వేశాడు.


కేటాయించిన సమయంలోపు వేయాల్సిన ఓవర్ల కంటే బెంగళూరు ఒక ఓవర్ తక్కువగా వేసి ఉండటంతో.. స్లో ఓవర్ రేట్ తప్పిదం కింద కెప్టెన్‌ విరాట్ కోహ్లీకి మ్యాచ్ రిఫరీ రూ.12 లక్షలు జరిమానా విధించాడు. కేఎల్ రాహుల్ స్లాగ్ ఓవర్లలో దూకుడు పెంచడంతో ఎక్కువగా బౌలర్లతో చర్చలు జరిపిన కోహ్లీ మ్యాచ్ సమయాన్ని వృథా చేసినట్లు మ్యాచ్ రిఫరీ తేల్చాడు. చివరి నాలుగు ఓవర్లలో కేఎల్ రాహుల్ వరుస సిక్సర్లు బాదడంతో తేలిపోయిన బెంగళూరు బౌలర్లు ఏకంగా 74 పరుగులు సమర్పించుకోవడం గమనార్హం.

మ్యాచ్‌లో టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ టీమ్ 3 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేయగా.. ఛేదనలో బెంగళూరు టీమ్ ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. ఆ జట్టులో వాషింగ్టన్ సుందర్ (30: 27 బంతుల్లో 2x4, 1x6) టాప్ స్కోరర్‌కాగా.. ఏబీ డివిలియర్స్ (28: 18 బంతుల్లో 4x4, 1x6), అరోన్ ఫించ్ (20: 21 బంతుల్లో 3x4) కాసేపు క్రీజులో నిలిచారు. కానీ.. ఈ ఇద్దరి ఔట్ తర్వాత పేకమేడని తలపించిన బెంగళూరు 17 ఓవర్లలోనే 109 పరుగులకి ఆలౌటైంది. కెప్టెన్ కోహ్లీ (1) వరుసగా రెండో మ్యాచ్‌లోనూ తక్కువ స్కోరుకే ఔటైపోయాడు.














Untitled Document
Advertisements