ఎన్‌సీబీ విచారణకు హాజరైన రకుల్

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 01:04 PM

ఎన్‌సీబీ విచారణకు హాజరైన రకుల్

సుశాంత్ సింగ్ ఆత్మహత్య కేసు విచారణలో భాగంగా బయటపడిన డ్రగ్స్ ఇష్యూ బాలీవుడ్‌ని వణికిస్తోంది. సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తి స్వయంగా డ్రగ్స్ వాడానని ఒప్పుకోవడం, పైగా హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్ పేర్లు బయట పెట్టడంతో ఈ ఇష్యూ సంచలనంగా మారింది. దీంతో దీనిపై లోతుగా విచారణ చేపట్టిన ఎన్‌సీబీ అధికారులు మరికొందరు హీరోహీరోయిన్లకు డ్రగ్స్ పెడ్లర్స్‌తో సంబంధాలున్నట్లు కనుగొని దీపికా పదుకొనే, రకుల్ ప్రీత్ సింగ్, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌లకు నోటీసులు పంపారు. దీంతో ఈ రోజు (శుక్రవారం) ముంబై చేరుకొని ఎన్‌సీబీ విచారణకు హాజరైంది రకుల్ ప్రీత్ సింగ్.

రకుల్ వెంట ఆమె సోదరుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖానికి మాస్క్ ధరించి ఎన్‌సీబీ కార్యాలయానికి వెళ్తూ కాస్త ఆందోళనగా కనిపించింది రకుల్ ప్రీత్ సింగ్. డ్రగ్స్ రాకెట్ విచారణలో భాగంగా రకుల్‌పై ఎన్‌సీబీ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారని తెలుస్తోంది. రియాతో మీకెలాంటి సంబంధాలున్నాయి?, రియా నుంచి డ్రగ్స్ తీసుకున్నారా?, సుశాంత్ ఫామ్‌హౌస్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీలకు వెళ్ళారా? అంటూ రకుల్ నుంచి కీలక సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇకపోతే డ్రగ్స్ ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టార్ హీరోయిన్లు దీపికా పదుకొనే, సారా అలీఖాన్‌‌లు రేపు (సెప్టెంబర్ 26) ఎన్‌సీబీ విచారణకు హాజరు కానున్నారు. కాగా దీపికాతో పాటు విచారణకు తాను కూడా హాజరవుతానని ఆమె భర్త రణ్‌వీర్‌సింగ్ ఎన్‌సీబీని కోరాడు. దీపిక ఒక్కోసారి ఉద్వేగానికి గురవుతుందనే కారణం చూపుతూ ఈ అభ్యర్థన పెట్టాడు. కాగా హీరోయిన్ల విచారణ నేపథ్యంలో ముంబై ఎయిర్‌పోర్ట్, ఎన్‌సీబీ కార్యాలయాల వద్ద పోలీసులు భారీగా మోహరించి భద్రత కల్పిస్తున్నారు.





Untitled Document
Advertisements