హేమంత్ పరువు హత్య: 13 మంది అరెస్టు!

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 02:05 PM

హేమంత్ పరువు హత్య: 13 మంది అరెస్టు!

హైదరాబాద్‌ చందానగర్‌కు చెందిన హేమంత్ పరువు హత్యా ఘటనలో పోలీసులు 13 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 12 మంది అవంతి కుటుంబ సభ్యులే కావడం గమనార్హం. పోలీసులు అదుపులోకి తీసుకున్నవారిలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, చిన్న మేనమామ యుగంధర్, మరో ఇద్దరు మేనమామలు సహా 12 మంది ఉన్నారు. వీరితో పాటు డ్రైవర్‌ను కూడా పోలీసులు అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకున్నవారిలో ముగ్గురు మహిళలు కూడా ఉన్నారు.

అరెస్టయిన వారి పేర్లు ఇవీ..
పోలీసులు అరెస్టు చేసిన వారిలో అవంతి తండ్రి లక్ష్మారెడ్డి, సందీప్ రెడ్డి, రంజిత్ రెడ్డి, రాకేష్ రెడ్డి, సంతోష్ రెడ్డి, విజేందర్రెడ్డి, యుగంధర్ రెడ్డి, స్వప్న, రజిత, స్పందన, అర్చన, సాహెబ్ పటేల్ (డ్రైవర్) అన్నారు.

వారి నుంచి మారుతీ బ్రిజా, ఐ20, స్విఫ్ట్ కార్లను స్వాధీనం చేసుకున్నారు. అవంతి చిన్న మేనమామ యుగంధర్ రెడ్డి మరో ఇద్దరితో కలిసి హేమంత్‌ను హత్య చేసినట్లుగా తెలుస్తోంది. గురువారం మధ్యాహ్నం యువ జంటను కిడ్నాప్ చేయడం దగ్గరి నుంచి ఈ 13 మంది హస్తం ఉన్నట్లుగా సమాచారం.

ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ‘‘నిన్న గచ్చిబౌలి పీఎస్‌లో కిడ్నాప్ కేసు నమోదు చేశాం. చందానగర్ తారానగర్‌లో అవంతి రెడ్డి, హేమంత్ కుమార్‌లు ఉండేవారు. అవంతి రెడ్డి బీటెక్ చదవగా, హేమంత్ డిగ్రీ కంప్లీట్ చేసి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాడు. ఇద్దరూ నాలుగు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. జూన్ నెల 11వ తేదీన పెద్దలను కాదని పెళ్లి చేసుకున్నారు. కుత్బుల్లాపూర్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో మ్యారేజ్ చేసుకున్నారు. చందానగర్ పోలీసులు అమ్మాయి, అబ్బాయి తల్లిదండ్రులను పిలిచి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.’’

‘‘కౌన్సిలింగ్ అయిన తర్వాత హేమంత్, అవంతి రెడ్డిలు గచ్చిబౌలిలోని టీఎన్జీవో కాలనీలో నివాసం ఉంటున్నారు. నిన్న మీతో మాట్లాడాలంటూ గచ్చిబౌలిలోని హేమంత్ నివాసానికి అవంతి కుంటుంబ సభ్యులు మూడు కార్లలో వచ్చారు. చందానగర్‌కి వెళ్లాలని వారిని కారులో తీసుకెళ్తుంతుండగా అనుమానం రావడంతో వెంటనే తప్పించుకునేందుకు అవంతిక, హేమంత్ ప్రయత్నించారు. కారులో నుంచి తప్పించుకుని అత్తమామలకు అవంతి ఫోన్ చేసింది. అవంతి మేనమామ యుగంధర్ రెడ్డి, మరికొందరు మరో కార్లో హేమంత్‌ను తీసుకుపోయారు.’’

‘‘హేమంత్ తల్లిదండ్రులు చందానగర్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంటనే గచ్చిబౌలి పోలీసులు అప్రమత్తమయ్యారు. గోపన్ పల్లిలో గురువారం తొమ్మిది మందిని గచ్చిబౌలి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అర్ధరాత్రి అవంతిక మేనమామ యుగందర్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా హేమంత్‌ను సంగారెడ్డిలో హత్య చేసి పడేసిన్నట్లు ఒప్పుకున్నాడు. మొత్తం 13 మందిని అదుపులోకి తీసుకున్నాం. మరోకరు పరారిలో ఉన్నారు.’’ అని వివరించారు.





Untitled Document
Advertisements