ఎస్పీ బాలు మృతికి టాలీవుడ్ సంతాపం

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 05:14 PM

ఎస్పీ బాలు మృతికి టాలీవుడ్ సంతాపం

గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శుక్రవారం మధ్యాహ్నం కన్నుమూసిన విషయం తెలిసిందే. కరోనాతో పోరాడి గెలిచి ఇతర ఆరోగ్య సమస్యలు చుట్టిముట్టడంతో బాలు మృతిచెందారు. సుమారు 50 రోజులు హాస్పిటల్‌లోనే బెడ్‌పై ఉండి మృత్యువుతో పోరాడి ఓడిపోయారు. తన తండ్రి శుక్రవారం మధ్యాహ్నం 1.04 గంటలకు తుదిశ్వాస విడిచినట్టు ఎస్పీ చరణ్ మీడియాకు ప్రకటించారు.
బాలు మృతితో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. గానగంధర్వుడి మృతిని టాలీవుడ్ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. బాలు మృతికి సంతాపం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు భావోద్వేగంగా ట్వీట్ చేశారు. ‘‘నా ప్రియమైన బాలు, సంగీత ప్రపంచంలో నిశ్శబ్దం ఆవరించింది..!! సరిగమలన్నీ కన్నీళ్లు పెడుతున్నాయి..!! రాగాలన్నీ మూగబోయాయి..!! నువ్వు లేని లోటు తీర్చలేనిది..!!’’ అని రాఘవేంద్రరావు పేర్కొన్నారు.

✦ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరనే నిజాన్ని నమ్మలేకపోతున్నాను. ఆయన మధురమైన గొంతుకి దగ్గర్లోకి కూడా ఎవరూ రాలేరు. మీ ఆత్మకు శాంతి చేకూరాలి సార్. మీ కీర్తి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ఆయన కుటుంబానికి ధైర్యం చేకూరాలని కోరుకుంటూ సంతాపం తెలియజేస్తున్నాను. - మహేష్ బాబు
✦ ఎప్పుడూ చిరునవ్వులు చిందించే మన ఎస్పీబీ గారు ఇకలేరనే వార్త విని షాక్‌కు గురయ్యాను. మన ఇండస్ట్రీకి ఆయన లేని లోటు ఊహకందడంలేదు. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. - రామ్ చరణ్

✦ తెలుగు వారి ఆరాధ్య స్వరం మూగబోయింది. భారతీయ సంగీతం తన ముద్దు బిడ్డను కోల్పోయింది. ఐదు దశాబ్దాలకు పైగా, 16 భాషల్లో 40 వేలకు పైగా పాటలకు జీవం పోసిన గాన గాంధర్వ, పద్మ భూషణ్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు ఇక లేరు అనే వార్త తీవ్రంగా కలచివేసింది. ఈ భువిలో సంగీతం ఉన్నంత కాలం మీరు అమరులే. - ఎన్టీఆర్

వీరితో పాటు మంచు లక్ష్మి, నాగశౌర్య, రాధిక, బండ్ల గణేష్, రితేష్ దేశ్‌ముఖ్, శ్రేయా ఘోషాల్, హేరిస్ జయరాజ్, నీల్ నితిన్ ముఖేష్, ఆర్య, తమన్, ప్రియమణి తదితరులు ఎస్పీబీ మృతికి సంతాపం తెలియజేస్తూ ట్వీట్లు చేశారు.











Untitled Document
Advertisements