ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారత క్రికెటర్లు ఘన నివాళి

     Written by : smtv Desk | Fri, Sep 25, 2020, 07:06 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారత క్రికెటర్లు ఘన నివాళి

ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం మృతిపై భారత క్రికెటర్లు వరుసగా స్పందిస్తున్నారు. ఇటీవల కరోనా వైరస్ బారిన పడిన ఎస్పీ బాలు.. ఆ తర్వాత కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యల కారణంగా గత కొద్దిరోజుల నుంచి చికిత్స పొందుతూ చెన్నైలో శుక్రవారం తుది శ్వాస విడిచారు. దాంతో.. ఎస్పీ బాలు పాడిన పాటల్ని గుర్తుచేసుకుంటూ భారత ఓపెనర్ శిఖర్ ధావన్, మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, సురేశ్ రైనా, గౌతమ్ గంభీర్, మహ్మద్ కైఫ్ తదితరులు నివాళులు అర్పించారు.

దేశ వ్యాప్తంగా 16 భాషల్లో సుమారు 40వేల పాటలు పాడిన ఎస్పీ బాలు.. వరల్డ్‌లోనే అత్యధిక పాటలు పాడిన మేల్ సింగర్‌గా ఖ్యాతి గడించారు. ముఖ్యంగా.. దక్షిణాది అగ్రశ్రేణి హీరోలు రజినీకాంత్, కమల్‌ హాసన్‌లకి గాత్రదానం చేసిన ఎస్పీ బాలు.. బాలీవుడ్‌‌లో సల్మాన్ ఖాన్, అనిల్ కపూర్‌లకి కూడా డబ్బింగ్ చెప్పాడు.

ఎస్పీ బాలు గాత్రానికి మెచ్చిన తమిళనాడు ప్రభుత్వం ‘కళైమామణి’ బిరుదుతో సత్కరించింది. కర్ణాటక ప్రభుత్వం నుంచి కర్ణాటక రాజ్యోత్సవ అవార్డును కూడా బాలు అందుకున్నారు. ఇక, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, చెన్నైలోని సత్యభామ యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, జేఎన్‌టీయూ అనంతపురం నుంచి గౌరవ డాక్టరేట్లను బాలు అందుకున్నారు.





Untitled Document
Advertisements