ఏపీ ప్రభుత్వం కొత్త ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది. ఈ పాలసీ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. ప్రస్తుతం ఏపీలో 2934 మద్యం దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలన్నింటినీ మరో ఏడాది పాటు కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి ఏడాది 20 శాతం మద్యం దుకాణాలను తగ్గించాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, లాక్ డౌన్ తర్వాత 13 శాతం దుకాణాలను తగ్గించడంతో... కొత్త పాలసీలో దుకాణాల ప్రస్తావనను తీసుకురాలేదు.
మరోవైపు ఆధ్యాత్మిక పట్టణమైన తిరుపతిలో రైల్వే స్టేషన్ నుంచి అలిపిరికి వెళ్లే మార్గంలో వైన్ షాపులకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. ఆర్టీసీ బస్టాండ్, నంది సర్కిల్, లీలా మహల్ సెంటర్, విష్ణు నివాసం, శ్రీనివాసం తదితర ప్రాంతాల్లో కూడా లిక్కర్ అమ్మకాలపై నిషేధం విధించింది.