కేంద్రం నుంచి మరో ఆర్థిక ప్యాకేజీకి ఛాన్స్...కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:31 PM

కేంద్రం నుంచి మరో ఆర్థిక ప్యాకేజీకి ఛాన్స్...కసరత్తు చేస్తున్న ఆర్థిక శాఖ

కోవిడ్ 19 దెబ్బకి దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడింది. చాలా మంది ఉద్యోగాలు కోల్పోయారు. దేశ జీడీపీ 23 శాతం తగ్గింది. ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ నుంచి పీఎం గరీబ్ కల్యాణ్ యోజన వంటి ప్యాకేజీలు ప్రకటించింది. అయితే వీటి వల్ల పెద్దగా ఫలితాలు కనిపించలేదు. దీంతో ఇప్పుడు మోదీ సర్కార్ మరో ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీని ప్రకటించేందుకు రెడీ అవుతోంది.

పండుగ సీజన్ ప్రారంభానికి ముందుగానే కేంద్ర ప్రభుత్వం ఈ ప్యాకేజీని ప్రకటించొచ్చనే అంచనాలున్నాయి. ఈసారి ప్రకటించబోయే ప్యాకేజీ గత రెండు ప్యాకేజీల కన్నా కీలకంగా ఉండే అవకాశముంది. రూ.35 వేల కోట్లతో ప్రోత్సాహక ప్యాకేజీని ప్రకటించొచ్చని ఈ విషయంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి జాతీయ మీడియాకు తెలిపారు. ఉపాధి కల్పన, గ్రామీణ ప్రాంతాలు లక్ష్యంగా ఈసారి ఆర్థిక ప్యాకేజీ ఉండబోతోంది.

కేంద్ర ప్రభుత్వం కొత్త ఆర్థిక ప్యాకేజీలో భాగంగా అర్బన్ జాబ్ స్కీమ్స్, రూరల్ జాబ్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, రైతులకు కొత్త స్కీమ్స్, నగదు బదిలీ వంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. దసరా పండుగకు ముందుగానే ఆర్థిక ప్యాకేజీ ప్రకటన ఉండొచ్చు. అక్టోబర్ నుంచి డిసెంబర్ త్రైమాసికం ప్రతి కన్సూమర్ బేస్డ్ కంపెనీకి చాలా కీలకం. ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ తయారీ కంపెనీలకు ముఖ్యమైన కాలం.

దీంతో ప్రభుత్వం కూడా ఈ త్రైమాసికంపై కన్నేసింది. డిమాండ్‌ను ఎలాగైనా పెంచాలని ప్రయత్నిస్తోంది. అందుకే కొత్త ప్యాకేజీని తీసుకువస్తోంది. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ మళ్లీ గాడిలో పడొచ్చని అంచనా వేస్తోంది. ఇకపోతే కరోనా వల్ల నష్టపోయిన, ఉద్యోగాలు కోల్పోయిన వారికి ముందుగా టైర్ 3, టైర్ 4 పట్టణాల్లో కొత్త స్కీమ్స్‌ను ప్రకటించొచ్చు. తర్వాత వీటిని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించొచ్చు.





Untitled Document
Advertisements