మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టులో వ్యాజ్యం దాఖలు

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:44 PM

మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టులో వ్యాజ్యం దాఖలు

అయోధ్యలోని రామమందిర వివాదానికి సుప్రీంకోర్టు తీర్పుతో తెరపడి ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగిపోయింది. తాజాగా, మథురలోని శ్రీకృష్ణ జన్మభూమి వివాదంపై కోర్టులో వ్యాజ్యం దాఖలైంది. ఆలయ సమీపంలోని ఉన్న షాహీ ఇద్గావ్ మసీదును తొలగించి, మొత్తం 13.7 ఎకరాల భూమిని శ్రీకృష్ణ మందిరానికే అప్పగించాలని మథుర కోర్టును ఆశ్రయించారు. మథురకు చెందిన రంజనా అగ్నిహోత్రి తన స్నేహితుడు, మరో ఆరుగురితో కలిసి ఈ వ్యాఖ్యం దాఖలు చేశారు.

వారి తరఫున హరి శంకర్ జైన్, విష్ణు శంకర్ జైన్ అనే లాయర్లు పిటిషన్ వేశారు. శ్రీకృష్ణుడి మందిరానికి చెందిన భూమిని ఆక్రమించి, మసీదు నిర్మించారని పేర్కొంటూ.. ప్రతివాదులుగా సున్నీ సెంట్రల్ వక్ఫ్ బోర్డును చేర్చారు. అయితే, ఆరాధన ప్రదేశాల (ప్రత్యేక నిబంధనలు) చట్టం- 1991 ప్రకారం.. వివాదాస్పద రామ జన్మభూమి-బాబ్రీ మసీదు కేసులో యాజమాన్యం హక్కులను సుప్రీంకోర్టు మినహాయించింది.

కానీ, 1947 నాటికి ఉన్న మతపరమైన స్థలం యథాతథ స్థితిని మార్చడానికి ఇతర కోర్టుల్లో వ్యాజ్యం దాఖలు చేయకుండా నిరోధించింది. అయోధ్య రామజన్మభూమి-బాబ్రీమసీదు కేసులు వివాదాస్పద ప్రాంతం హిందువులకే చెందుతుందని గతేడాది నవంబరు 9న తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు.. తాజాగా, కాశీ, మధుర వంటి ప్రదేశాలలో యథాతథ స్థితిని మార్చే వ్యాజ్యాలకు తలుపులు మూసివేసింది.

ఆగస్టు 15, 1947న బ్రిటిష్ పాలన నుంచి విముక్తి పొందిన తర్వాత రాజ్యాంగ ప్రాతిపదికన దేశంలోని ప్రార్థనా స్థలాలు, మతపరమైన విధానాల రక్షణకు పార్లమెంటు నిర్ణయించింది. ప్రతి మతానికి చెందిన ప్రార్థనా స్థలాలు సంరక్షించి, యథాతథ స్థితి మార్చబోమని విశ్వాసం కల్పించింది.

కాట్రా కేశవ్ దేవ్ వద్ద ఉన్న మొత్తం 13.37 ఎకరాల స్థలంపై యూపీ సున్నీ వక్ఫ్ బోర్డ్, మసీదు ట్రస్ట్ లేదా ఇతర ముస్లిం వర్గాలకు ఎటువంటి హక్కులేవని, మొత్తం భగవాన్ శ్రీకృష్ణ జన్మభూమిదేనని వ్యాజ్యం దాఖలు చేసిన రంజనా అగ్నిహోత్రి అన్నారు. శ్రీకృష్ణ ఆలయంలోని కొంత భాగాన్ని 1669-70లో నాటి మొగల్ పాలకుడు ఔరంగజేబు ధ్వంసం చేసి మసీదు నిర్మించారు.. ఇది జరిగిన వందేళ్ల తర్వాత యుద్ధంలో మరాఠాలు విజయం సాధించి, మథుర, ఆగ్రాలను స్వాధీనం చేసుకున్నారు.. అనంతరం మసీదును తొలగించి శ్రీకృష్ణుడి ఆలయాన్ని పునరుద్దరించారు’ అని వ్యాజ్యంలో పేర్కొన్నారు.

‘ఆగ్రా, మథురలను మరాఠాలు నాజుల్ భూమిగా ప్రకటించారు. బ్రిటిష్ ప్రభుత్వం కూడా 1803 వరకు దీనిని కొనసాగించింది.. 1815లో మొత్తం 13.37 ఎకరాలను వేలం వేయగా కాశీ రాజు పట్నీమల్ దక్కించుకున్నారు.. 1921లో ఈ భూమి తమకే చెందుతుందని ముస్లింలు వేసిన పిటిషన్‌ను సివిల్ కోర్టు కొట్టివేసింది..

తర్వాత 1944లో కాశీ రాజు వారసులు పండిట్ మదన్ మోహన్ మాలవ్యా, గోస్వామి గణేశ్ దత్, భికేన్ లాల్జీ అటార్నీలకు ఈ భూమిని అమ్మేశారు.. రూ.13,400 మొత్తాన్ని జుగల్ కిశోర్ బిర్లా చెల్లించారు.. ఇక, 1951 మార్చిలో ట్రస్ట్‌ను ఏర్పాటుచేసి, మొత్తం భూమి దానికే చెందుతుందని పేర్కొన్నారు.. దివ్యమైన మందిర నిర్మించాలని ట్రస్ట్ నిర్ణయించింది’ అని వివరించింది.

‘1968లో శ్రీకృష్ణ జన్మస్థాన సేవా సంఘం, షాహీ మసీదు ఇద్గా మధ్య రాజీ కుదిరింది.. అయినా వాటికి ఈ భూమిపై ఎటువంటి యాజమాన్య హక్కులు లేవు. వారి వ్యాజ్యం ప్రకారం భక్తుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ట్రస్ట్.. మసీదు ఇద్గా డిమాండ్లకు అంగీకరించింది. జూలై 1973లో మథుర సివిల్ జడ్జి ఇరు వర్గాల మధ్య రాజీ కుదిర్చి, ఇప్పటికే ఉన్న నిర్మాణాలను మార్చడాన్ని నిషేధించారు’ అని పేర్కొంది.





Untitled Document
Advertisements