ఆ ఆస్తులకు ప్రత్యేక పాస్ పుస్తకాలు:కేటీఆర్

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 01:58 PM

ఆ ఆస్తులకు ప్రత్యేక పాస్ పుస్తకాలు:కేటీఆర్

జిహెచ్ఎంసి పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యల పైన పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిహెచ్ఎంసి ప్రధాన కార్యాలయం నుంచి జరుగుతున్న ఈ వీడియో కాన్ఫెరెన్స్ లో రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్,మేయర్ బొంతు రామ్మోహన్ పలువురు ఉన్నతాధికారులు, జిల్లాల కలెక్టర్లు, జోనల్, డిప్యూటీ కమీషనర్లు పాల్గొన్నారు. వీరితో పాటు... వివిధ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, కాలనీల సంఘాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు.

హైదరాబాద్ నగరం గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు మంత్రి కేటీఆర్. ఒకవైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనా సంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ విస్తరిస్తుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకువచ్చి ప్రతి ఒక్కరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పైన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతుందన్నారు. సామాన్యుడిపై ఏలాంటి భారం పడకుండా సామాన్యుడికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి ఆమోదం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలో భవిష్యత్తులో అన్ని రిజిస్ట్రేషన్లు ధరణి పోర్టల్ ఆధారంగానే జరుగుతాయన్నారు.

వ్యవసాయ మరియు వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండు వేరు వేరు రంగుల్లో పాస్ పుస్తకాలు ఇస్తామన్నారు.ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపుగా భూ సమస్యలు తొలగిపోయాయన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తుందన్నారు. అందులో భాగంగానే ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ నగరంలో సుమారు 24 లక్షల 50 వేల ఆస్తులు ఉన్నట్లు అంచనా ఉందన్నారు. ఇందులో ఇందులో వివిధ కారణాలతో కొన్ని ఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయిని తెలిపారు. హైదరాబాద్ ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నం చేస్తున్నామన్నారు.

ప్రస్తుత సమావేశంలో విస్తృతంగా చర్చించిన అంశాలపై తర్వాత అవసరమైతే క్యాబినెట్ ద్వారా ప్రత్యేక నిర్ణయాలు తీసుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. రానున్న 15 రోజుల పాటు ధరణి పోర్టల్ లో ఆస్తుల నమోదు కార్యక్రమంలో ప్రజాప్రతినిధులంతా చురుగ్గా పాల్గొనాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఎవరు కూడా దళారులను నమ్మవద్దని ఒక్కపైసా ఇవ్వవద్దని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పారదర్శకంగా, ఉచితంగా జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.





Untitled Document
Advertisements