ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు: కూర్చోబెట్టి ఖననం!

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:45 PM

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు: కూర్చోబెట్టి ఖననం!

దిగ్గజ గాయకుడు, నటుడు, సంగీత దర్శకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ లోకం నుంచి నిష్క్రమించారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అంత్యక్రియలు శనివారం మధ్యాహ్నం చెన్నై శివారులోని తిరువ‌ళ్ళూరు జిల్లా తామ‌రైపాక్కం ఫాంహౌజ్‌లో ముగిశాయి. ఎస్పీ చరణ్ తన తండ్రికి అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సంప్రదాయబ‌ద్ధంగా వైదిక క్రతువు పూర్తి చేసి శ్రౌత‌శైవ ఆరాధ్య సంప్రదాయం ప్రకారం బాలుని ఖ‌న‌నం చేశారు.

ఈ సంప్రదాయం ప్రకారం బాలుని కూర్చోబెట్టి ఖననం చేశారు. కుర్చీలో కూర్చున్నట్టుగా కూర్చోబెట్టి, కాళ్లు చాపి ఖననం చేశారు. తమిళనాడులో వీరశైవ జంగమ, ఆరాధ్య కులస్థులను ఈ విధంగానే కూర్చోబెట్టి ఖననం చేస్తారు. తమిళనాడులో చాలా కులాలు ఇదే సంప్రదాయాన్ని పాటిస్తాయని సమాచారం. సాధారణంగా వైష్ణవుల్లో సంసార జీవితం గడిపిన వారిని ఖననం చేయరు. దహనం చేస్తారు. కానీ, వీరశైవుల్లో మాత్రం ఖననమే చేస్తారు. అది కూడా కూర్చున్న పొజిషన్‌లో. బాలు విషయంలో కూడా అదే జరిగింది.

కాగా, ఎస్పీ బాలుకి తమిళ సినీ ప్రముఖులు, అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ బాలు అంత్యక్రియల్లో పాల్గొని ఆయనకు నివాళి అర్పించారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి అనిల్‌ కుమార్‌ యాదవ్ హాజరయ్యారు. ఇక సినిమా సెల‌బ్రిటీలు దేవి శ్రీ ప్రసాద్, భార‌తీరాజా, మ‌నో, యాక్షన్ కింగ్ అర్జున్ త‌దిత‌రులు అంత్యక్రియ‌ల్లో పాల్గొన్నట్టు సమాచారం.





Untitled Document
Advertisements