బీహర్ ఎన్నికలు: హ్యాట్రిక్‌పై గురిపెట్టిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 08:51 PM

బీహర్ ఎన్నికలు: హ్యాట్రిక్‌పై గురిపెట్టిన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్

బిహార్‌ శాసనసభకు మూడు దశల్లో ఎన్నికల నిర్వహించనున్నారు. ఈ మేరకు కేంద్రం ఎన్నికల సంఘం షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. దీంతో అధికార, ప్రతిపక్షాలు అస్త్రశస్త్రాలతో సిద్ధమయ్యాయి. ఈ నేపథ్యంలో శివసేన సీనియర్ నేత సంజయ్‌ రౌత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బిహార్‌లో తగినన్ని సమస్యలు లేకపోతే.. ముంబై నుంచి కొన్నింటిని పార్శిల్‌ చేసి పంపుతామని ఎద్దేవా చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ కేసును ఉపయోగించుకుని బిహార్ ఎన్నికల్లో లబ్ధి పొందాలని బీజేపీ భావిస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న వేళ సంజయ్‌ రౌత్‌ ఈ వ్యాఖ్యలు చేశారు.

సంజయ్ రౌత్ మాట్లాడుతూ.. ‘రాష్ట్ర ఎన్నికల్లో శాంతి భద్రతలు, అభివృద్ధి, సుపరిపాలన వంటి అంశాలపై పోరాడాలి. అయితే ఈ సమస్యలు అయిపోయినట్లు మీరు భావిస్తే చెప్పండి.. ముంబై నుంచి కొన్ని సమస్యల్ని పార్శిల్‌గా పంపుతాం’ అన్నారు. అంతేకాదు, బిహార్‌ ఎన్నికల్లో శివసేన పోటీ చేస్తుందని, దీనిపై రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని స్పష్టంచేశారు. బిహార్‌ ఎన్నికల్లో కులం, ఇతర అంశాలే ప్రభావం చూపుతాయని, కార్మిక చట్టాలు, రైతుల సమస్యలను పట్టించుకోరని సంజయ్ రౌత్‌ మండిపడ్డారు.

యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానికి సంబంధించిన మాదకద్రవ్యాల కేసులో పలువురు బాలీవుడ్ ప్రముఖులను నార్కోటిక్స్ కంట్రోల్ ఆఫ్ బ్యూరో ప్రశ్నించడాన్ని సంజయ్ విమర్శించారు. సుశాంత్ కేసు దర్యాప్తునకు ముంబయి పోలీసులు సహకరించడం లేదంటూ బిహార్ మాజీ డీజీపీ గుప్తేశ్వర్ పాండే ఆరోపణలు గుప్పించడంతో మొదలైన వివాదం క్రమంగా రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

సుశాంత్ కేసులో సీబీఐ విచారణకు బిహార్ ప్రభుత్వం కోరగా.. దీనికి కేంద్రం ఆమోదించింది. అయితే, మహారాష్ట్ర ప్రభుత్వం మాత్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు సైతం కేంద్రం నిర్ణయాన్ని సమర్ధించడంతో సీబీఐ రంగంలోకి దిగింది. కేవలం బిహార్ ఎన్నికల్లో లబ్ది కోసమే సుశాంత్ మరణంపై బీజేపీ రాద్దాంతం చేస్తోందని శివసేన విమర్శలు గుప్పిస్తోంది.





Untitled Document
Advertisements