'దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం'

     Written by : smtv Desk | Sat, Sep 26, 2020, 09:01 PM

'దసరా రోజున ధరణి పోర్టల్ ప్రారంభం'

వచ్చే నెలలో దసరా పండుగ రోజున ధరణి పోర్టల్ ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ధరణి పోర్టల్ ప్రారంభించేందుకు కావాల్సిన అన్ని కార్యక్రమాలను పండుగలోపే పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ధరణి పోర్టల్‌కు అవసరమైన సాఫ్ట్ వేర్, హార్డ్ వేర్, బ్యాండ్ విడ్త్‌లను సిద్ధం చేయాలని చెప్పారు. కాగా మారిన రిజిస్ట్రేషన్ విధానం, వెంటనే మ్యుటేషన్ చేయడం, ధరణి పోర్టల్‌కు వివరాలను అప్‌డేట్ చేయడం వంటి అంశాలు, విధివిధానాలపై తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, సబ్ రిజిస్ట్రార్‌లకు శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు.

దసరా లోగానే అన్ని రకాల ఆస్తులకు సంబంధించిన డేటాను ధరణి పోర్టల్‌లో నిక్షిప్తం చేయాలని అధికారులను ఆదేశించారు. ఆ తర్వాత జరిగే మార్పు చేర్పులు వెంటనే నమోదు చేస్తామని తెలిపారు. దసరా రోజున పోర్టల్ ప్రారంభిస్తున్న వేళ అదే రోజు రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతాయని సీఎం చెప్పారు. ఈలోగా ఎలాంటి రిజిస్ట్రేషన్లు కానీ, ఎలాంటి రెవెన్యూ వ్యవహారాలు కానీ జరగబోవని సీఎం కేసీఆర్‌ చెప్పారు.

ధరణి పోర్టల్‌తో డెమో ట్రయల్స్ నిర్వహించి అధికారులకు అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు సీఎం చెప్పారు. ప్రతి మండలం, ప్రతి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఒక కంప్యూటర్ ఆపరేటర్‌ నియామకాన్ని పూర్తి చేయాలని ఆదేశించారు. ధరణి పోర్టల్ ప్రారంభం కావడానికి ముందే రాష్ట్ర వ్యాప్తంగా సర్వే నెంబర్ల వారీగా రిజిస్ట్రేషన్ రేట్లను నిర్ణయించనున్నట్లు సీఎం తెలిపారు. ఆ రేట్ల ప్రకారమే రిజిస్ట్రేషన్లు జరుగుతాయని అన్నారు. తహశీల్దార్‌, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో డాక్యుమెంట్ రైటర్లకు లైసెన్సులు ఇచ్చి వారికి శిక్షణ ఇవ్వనున్నట్లు సీఎం వెల్లడించారు.





Untitled Document
Advertisements