తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 02:19 PM

తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు

తిరుమల అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో రెండో రోజు శ‌నివారం ఉద‌యం శ్రీ‌వారి ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పంలో శ్రీ మలయప్ప స్వామివారు ఐదు తలల చిన్నశేష వాహనంపై నెమ‌లి పింఛం, గ‌ద‌తో దామోద‌ర కృష్ణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. పురాణ ప్రాశస్త్యం ప్రకారం చిన్నశేషుడిని వాసుకి (నాగ‌లోకానికి రాజు)గా భావిస్తారు. శ్రీ వైష్ణవ సంప్రదాయానుసారం భగవంతుడు శేషి, ప్రపంచం శేషభూతం. శేషవాహనం ఈ శేషిభావాన్ని సూచిస్తుంది. చిన్నశేష వాహనాన్ని దర్శిస్తే కుటుంబ శ్రేయ‌స్సుతోపాటు కుండలినీయోగ సిద్ధిఫలం లభిస్తుందని ప్రశస్తి. స్వామివారు శనివారం రాత్రి హంస వాహనంపై దర్శనమిస్తారు. కేంద్రం మార్గదర్శకాలు, కరోనా నిబంధనల్ని పాటిస్తూ ఈసారి ఏకాంతంగా బ్రహోత్సవాలు నిర్వహిస్తున్నారు. నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఆలయానికే పరిమితం కానున్నాయి. ఆల‌యంలోని క‌ల్యాణోత్స‌వ మండ‌పంలో వాహ‌న‌సేవ‌లు జరుగుతున్నాయి. బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా స్వామివారికి ఆగ‌మోక్తంగా నిర్వ‌హించే కార్య‌క్ర‌మాల‌న్నీ య‌థాత‌థంగా నిర్వ‌హిస్తారు. భ‌క్తుల కోసం వాహ‌న‌సేవ‌ల‌ను శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తుంది. టీటీడీ ఐ అండ్ పీఆర్ మీడియాకు ఎప్ప‌టిక‌ప్పుడు ప‌త్రికా ప్ర‌క‌ట‌న‌లు, ఫొటోలు అందించనుంది.





Untitled Document
Advertisements