20 ఏళ్ళు పెరిగిన భారతీయుల ఆయుష్షు, కాని...?!

     Written by : smtv Desk | Sat, Oct 17, 2020, 07:59 PM

20 ఏళ్ళు పెరిగిన భారతీయుల ఆయుష్షు, కాని...?!

కరోనా మహమ్మారి వార్తలతో విసిగిపోతున్న భారతీయులకు ఇదొక శుభవార్త. దేశవాసుల ఆయుష్షు బాగా పెరిగింది. 1990లో 59.6 ఏళ్లుగా ఉన్న భారతీయుల సగటు జీవిత కాలం (Life Expectancy) 2019 నాటికి 70.8 ఏళ్లకు పెరిగింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్‌ ‘ది లాన్సెట్‌’ ఈ మేరకు ఓ సర్వే నివేదికను ప్రచురించింది. గడిచిన 30 సంవత్సరాల కాలంలో భారతీయుల ఆయుర్ధాయం 10 సంవత్సరాలు పెరగడం విశేషం. ఇదేమంత చిన్న విషయం కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇదే సమయంలో ఆయుష్షు పెరిగినా.. చాలా మంది అనేక సమస్యలతో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. వ్యక్తి మరణాలకు గల కారణాలు, వ్యాధుల తీవ్రతపై ప్రపంచవ్యాప్తంగా పరిశోధన (Lancet study) చేపట్టారు. సర్వేలో భాగంగా 200 దేశాల్లో నిపుణుల బృందం అధ్యయనం చేసింది. మరణాలకు గల 286 కారణాలు, 369 వ్యాధులు, వివిధ రకాల గాయలను విశ్లేషిస్తూ అధ్యయనం చేశారు. గత మూడు దశాబ్దాలలో భారతదేశం సరాసరి ఆయుర్ధాయం 10 ఏళ్లు పెరగగా.. రాష్ట్రాల మధ్య తీవ్ర వ్యత్యాసాలున్నాయి. ఉదాహరణకు కేరళ రాష్ట్రంలో సగటు జీవితకాలం అత్యధికంగా 77.3 ఏళ్లు ఉండగా.. ఉత్తర్‌ ప్రదేశ్‌లో 66.9 ఏళ్లుగా ఉంది. అయితే.. ఆయుష్షు పెరిగిందని సంతోషించడానికి లేదని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. మన దేశంలో చాలా మంది దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, వివిధ రుగ్మతలతోనే కాలం వెల్లదీస్తున్నారని వారంటున్నారు. ఆరోగ్యవంతమైన జీవిత కాలం గడుపలేకపోతున్నారని అభిప్రాయపడ్డారు. ‘‘భారతీయుల ఆయుష్షు పెరిగింది. కానీ, పెరగాల్సింది ‘ఆరోగ్యవంతమైన ఆయుష్షు’. దేశంలో ఎక్కువ మంది చాలా ఏళ్లు అనారోగ్యం, అంగవైకల్యంతోనే ఉంటున్నారు’’ అని డాక్టర్ శ్రీనివాస్ గోలి అన్నారు. గాంధీ నగర్‌లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ హెల్త్‌కు చెందిన శ్రీనివాస్ ఈ పరిశోధనలో పాల్పంచుకోవడం విశేషం. దేశంలో గుండె సంబంధ వ్యాధులు ఐదో స్థానంలో ఉండగా.. ప్రస్తుతం అవి మొదటి స్థానంలోకి వచ్చాయి. ఇది ఆందోళన కలిగించే అంశం. వీటితో పాటు కేన్సర్ వ్యాధులు కూడా భారీగా పెరిగినట్లు అధ్యయనంలో తేలింది.

లాన్సెట్ సర్వే ముఖ్యాంశాలు:
* ఈ 30 సంవత్సరాల్లో ఆరోగ్య రంగంలో భారత్‌ గణనీయమైన మార్పును సాధించిందని పరిశోధనలో పాల్గొన్న నిపుణుల బృందం అభిప్రాయపడింది. మాతాశిశు మరణాల రేటు కూడా గణనీయంగా తగ్గిందని నివేదికలో పేర్కొన్నారు.
* బిహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌ లాంటి రాష్ట్రాల్లో ఇంకా పోషకాహార లోపంతో పిల్లలు, బాలింతలు తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు.
* గత 30 ఏళ్లుగా స్థూలకాయం, అధిక రక్తపోటు, షుగర్‌, కాలుష్యం కారకాలతో ప్రభావితం కావడం వల్ల ప్రస్తుతం కరోనా సమయంలో మరణాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు తాజా నివేదికలో పేర్కొన్నారు.
* భారత్‌తో పాటు దాదాపు ప్రతి దేశంలో అంటువ్యాధుల వ్యాప్తి తగ్గినప్పటికీ, దీర్ఘకాలిక వ్యాధుల పెరుగుతున్నట్లు అధ్యయనంలో తేలింది. మెరుగైన వైద్య సదుపాయాలు, ఇమ్యునైజేషన్‌ లాంటి కార్యక్రమాల వల్ల అంటువ్యాధుల తీవ్రతను చాలా దేశాలు అరికట్టగలుతున్నట్లు పేర్కొన్నారు.
* దేశంలో గుండె సంబంధ వ్యాధులు ఐదో స్థానంలో ఉండగా.. ప్రస్తుతం అవి మొదటి స్థానంలోకి వచ్చాయి. కేన్సర్ కేసులు కూడా భారీగా పెరిగాయి.

దీర్ఘకాలిక వ్యాధుల సంక్షోభం ప్రపంచవ్యాప్తంగా ఉందని.. వీటిలో ప్రజారోగ్య వ్యవస్థలు విఫలమవుతున్నాయని పరిశోధనలో పాల్గొన్న అంతర్జాతీయ నిపుణులు పేర్కొన్నారు. ముఖ్యంగా అధిక రక్తపోటు, పొగాకు వాడకం, గాలికాలుష్యం లాంటి ప్రమాదకర పరిస్థితులను నిరోధించే వీలున్నప్పటికీ, వీటిపై చర్యలు తీసుకోలేకపోతున్నట్లు వివరించారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా వీటిపై దృష్టి సారించాలని, ప్రజలు ఆరోగ్య సూత్రాలను తమ జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు.





Untitled Document
Advertisements