ఫీల్ గుడ్ మెలోడీస్ స్పెషలిస్ట్ జస్టిన్ ప్రభాకరన్‌కు ప్రభాస్ బంపర్ ఆఫర్

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 05:52 PM

ఫీల్ గుడ్ మెలోడీస్ స్పెషలిస్ట్ జస్టిన్ ప్రభాకరన్‌కు ప్రభాస్ బంపర్ ఆఫర్

సినిమాకు సంగీతం ప్రాణం. ఒక సినిమా మ్యూజికల్‌గా హిట్ అయ్యిందంటే సగం విజయం సాధించినట్టే. అందుకే, సినిమాల్లో పాటలకు అంత ప్రాధాన్యత ఉంటుంది. అయితే, ప్రభాస్ గత చిత్రం ‘సాహో’ సంగీతం పరంగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలోని పాటలన్నీ బాలీవుడ్ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేసినట్టు ఉన్నాయనే విమర్శలు వచ్చాయి. అందుకే, ‘రాధే శ్యామ్’ విషయంలో ప్రభాస్ చాలా ఆలోచించి నిర్ణయం తీసుకున్నారు. అయితే, ఈ నిర్ణయం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తమిళ ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న యువ సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరన్‌కు ప్రభాస్ అవకాశం ఇచ్చారు. ఈయన ఇప్పటికే తెలుగులో విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ చిత్రానికి సంగీతం సమకూర్చారు. ఈ సినిమాలో పాటలు తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఫీల్ గుడ్ మెలోడీస్ అందించడంలో జస్టిన్ ప్రభాకరన్ దిట్ట. అందుకే, ‘రాధే శ్యామ్’ లాంటి లవ్ స్టోరీకి ఆయనైతే న్యాయం చేస్తారని ప్రభాస్ భావించినట్టున్నారు. నిజానికి జస్టిన్ ప్రభాకరన్‌కు ఇదొక బంపరాఫర్. ఎందుకంటే, ఇప్పటి వరకు ఆయన తమిళంలో భారీ చిత్రాలకు పనిచేయలేదు. ఆయన ఇప్పటి వరకు ఎవరైనా బిగ్ స్టార్స్‌తో పనిచేశారు అంటే.. అది విజయ్ సేతుపతి, విజయ్ దేవరకొండతోనే!

కాగా, పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతోన్న ‘రాధే శ్యామ్’‌కు నాలుగు భాషల్లో జస్టిన్ ప్రభాకరన్ సంగీతం సమకూరుస్తున్నారు. అంటే.. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో మాత్రమే ప్రభాకరన్ ఆల్బమ్స్ ఉంటాయి. హిందీకి ఇంకా సంగీత దర్శకుడిని ఖరారు చేయలేదు. ఇదిలా ఉంటే, ఈనెల 23న ప్రభాస్ పుట్టినరోజును పురష్కరించుకుని ‘రాధే శ్యామ్’ సినిమా నుంచి తొలి మోషన్ పోస్టర్‌ను విడుదల చేస్తున్నారు. దీనికి ‘బీట్స్ ఆఫ్ రాధే శ్యామ్’ అని టైటిల్ పెట్టారు. ఈ మోషన్ పోస్టర్ కోసం ప్రభాస్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘రాధే శ్యామ్’కు ‘జిల్’ ఫేమ్ కె.కె.రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. రెబల్ స్టార్ డాక్టర్ యు.వి.కృష్ణంరాజు సమర్పణలో గోపీకృష్ణ మూవీ, యూవీ క్రియేషన్స్ బ్యానర్లపై వంశీ, ప్రమోద్, ప్రసీద నిర్మిస్తున్నారు. హిందీలో టి-సిరీస్ సంస్థ ఈ చిత్రాన్ని విడుదల చేస్తోంది. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. ఈ చిత్రీకరణలో ప్రభాస్, పూజా హెగ్డే‌తో పాటు బాలీవుడ్ నటుడు కునాల్ రాయ్ కపూర్ కూడా పాల్గొంటున్నారు. ఇంకా ఈ సినిమాలో సత్యరాజ్, భాగ్యశ్రీ, జగపతి బాబు, జయరాం, సచిన్ ఖేడేకర్, భీనా బెనర్జీ, మురళీశర్మ, షాషా చేత్రి, ప్రియదర్శి, రిధి కుమార్, సత్యన్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.





Untitled Document
Advertisements