భారత భూభాగంలోకి చొరబడ్డ చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న ఆర్మీ

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:00 PM

భారత భూభాగంలోకి చొరబడ్డ చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న ఆర్మీ

తూర్పు లడఖ్‌లోని దేమ్‌చోక్ సెక్టార్‌లో వాస్తవాధీన రేఖ వద్ద అనుకోకుండా భారత భూభాగంలోకి చొరబడ్డ చైనా పీపుల్స్ ఆర్మీకి చెందిన ఓ సైనికుడిని సోమవారం అదుపులోకి తీసుకున్నారు. అతడిని పీఎల్ఏ‌కు చెందిన సైనికుడు వాంగ్ యా లాంగ్‌గా గుర్తించారు. ప్రస్తుతం భారత సైన్యం అధీనంలో ఉన్న అతడిని చైనాకు అప్పగించనున్నారు. చూషుల్-మోల్డో మీటింగ్ పాయింట్ వద్ద ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాత చైనా అధికారులకు అప్పగిస్తారు. అతడికి ఆక్సిజన్ సహా అవసరమైన వైద్య చికిత్స కల్పించారు. అత్యంత ఎత్తులో ఉండటంతో తీవ్రమైన చలి వాతావరణ పరిస్థితులను తట్టుకునే దుస్తులు, ఆహారం భారత సైన్యం అందజేసింది. ఆ సైనికుడు పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించి ఉండవచ్చని ఆర్మీ వర్గాలు తెలిపాయి. సరిహద్దుల్లో నెలకున్న ప్రతిష్టంభనపై ఎనిమిదో దశ చర్చల కోసం భారత్-చైనాలు సిద్ధమవుతోన్న వేళ ఈ ఘటన చోటుచేసుకుంది. చివరిసారిగా అక్టోబరు 12న చూషుల్ వద్ద ఇరు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరిగాయి. అయితే, ఉద్రిక్తతలను తగ్గించడానికి ఎటువంటి తీర్మానం చేయకుండానే చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. లడఖ్‌ను తాము గుర్తించడం లేదని, దాన్ని భారత్‌ చట్టవిరుద్ధంగా కేంద్ర పాలిత ప్రాంతంగా ఏర్పాటు చేసిందని చైనా ఇటీవల విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ‘అరుణాచల్ ప్రదేశ్, చట్టవిరుద్ధంగా ఏర్పాటు చేసిన లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాన్ని తాము గుర్తించలేదని స్పష్టం చేయాలనుకుంటున్నాం.. సరిహద్దు ప్రాంతంలోని సైనిక వివాదానికి కారణమైన మౌలిక సదుపాయాల అభివృద్ధికి తాము వ్యతిరేకమని’ చైనా విదేశాంగ శాఖ ప్రకటించింది. దీనిపై భారత్ కూడా దీటుటా స్పందించింది. లడఖ్, అరుణాచల్ ప్రదేశ్‌లు తమ అంతర్భాగాలను, ఈ విషయంలో జోక్యం చేసుకోకపోవడం మంచిదని హితవు పలికింది.





Untitled Document
Advertisements