చైనా కరోనా వ్యాక్సిన్ సేఫ్, ప్రకటించిన బ్రెజిల్‌

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 06:08 PM

చైనా కరోనా వ్యాక్సిన్ సేఫ్, ప్రకటించిన బ్రెజిల్‌

చైనా కరోనా వ్యాక్సిన్ సురక్షితమేనని వెల్లడైంది. చైనాకు చెందిన ‘సినోవాక్‌ బయోటెక్’ అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ ‘కరోనా వ్యాక్’పై బ్రెజిల్‌లోని ప్రముఖ బయోమెడికల్ పరిశోధనా కేంద్రం ‘సావో పాలో బుటాంటన్‌ ఇనిస్టిట్యూట్’ క్లినికల్ ట్రయల్స్ చేస్తోంది. ఈ ప్రయోగాలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే 9 వేల మంది వాలంటీర్లకు ఈ టీకాను ఇచ్చారు. తుది దశ ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చాయని సావో పాలో బుటాంటన్‌ ఇనిస్టిట్యూట్ ఒక ప్రకటనలో పేర్కొంది. టీకా తీసుకున్న వారిలో ఎలాంటి సమస్యలు రాలేదని తెలిపింది. మూడో దశ క్లినికల్ ట్రయల్స్‌లో భాగంగా 9000 మంది వాలంటీర్లపై రెండు డోసులుగా కరోనా వ్యాక్ టీకా‌ను ఇచ్చామని బ్రెజిల్ పరిశోధనా కేంద్రం వెల్లడించింది. టీకా తీసుకున్న వాలంటీర్లలో ఎవరూ అస్వస్థతకు గురికాలేదని ఇనిస్టిట్యూట్ అధికారులు తెలిపారు. టీకా మొదటి డోసు అనంతరం ఇంజెక్షన్ కారణంగా 20 శాతం మందిలో స్వల్పంగా నొప్పి, 15 శాతం మందిలో తలనొప్పి లాంటి లక్షణాలు కనిపించినట్లు పరిశోధకులు తెలిపారు. రెండో డోసులో 10 శాతం మందికి తలనొప్పి, 5 శాతం మందికి అలసట, వికారం, స్వల్పంగా కండరాల నొప్పులు లాంటి లక్షణాలు కనిపించాయని వెల్లడించారు. ట్రయల్స్‌లో మొత్తం 15 వేల మంది వాలంటీర్లు పాల్గొంటున్నారని.. వారందరిపై ప్రయోగాలు పూర్తయిన తర్వాతే వ్యాక్సిన్‌ సమర్థతకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తామని బుటాంటన్‌ డైరెక్టర్ పేర్కొన్నారు. బ్రెజిల్‌లో చివరి దశకు సంబంధించిన క్లినికల్ ట్రయల్స్ ప్రాథమిక ఫలితాలను సోమవారం (అక్టోబర్ 19) వెల్లడించారు. టీకా ప్రయోగాలు ఈ దశకు చేరుకున్న తొలి వ్యాక్సిన్ తయారీ సంస్థగా ‘సినోవాక్‌’ నిలిచింది. ఈ ఏడాది చివరికల్లా అన్ని అనుమతులను పొంది, 2021 ప్రారంభం నుంచి ప్రజలందరికి టీకా ఇవ్వాలని భావిస్తున్నారు.





Untitled Document
Advertisements