దివ్య తల్లిదండ్రులను కలిసిన సీఎం జగన్‌, రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆదేశం

     Written by : smtv Desk | Tue, Oct 20, 2020, 07:04 PM

దివ్య తల్లిదండ్రులను కలిసిన సీఎం జగన్‌, రూ. 10 లక్షలు ఇవ్వాలని ఆదేశం

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన విజయవాడ ఇంజనీరింగ్‌ విద్యార్థిని దివ్య తేజస్విని హత్య కేసుకు సంబంధించి ఆమె తల్లిదండ్రులు మంగళవారం ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా తమకు న్యాయం చేయాలంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను దివ్య కుటుంబ సభ్యులు కోరారు. అనంతరం దివ్య తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడుతూ.. తమను చూసి సీఎం జగన్ చలించి పోయారని చెప్పారు. తప్పకుండా నిందితుడిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని వెల్లడించారు. ఆడపిల్లల ఎదుగుదలకు సీఎం జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టారని, వాటి ద్వారా మా కూతురు ఎంతో ఉన్నతికి వస్తారని అనుకున్నామని దివ్య తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న దివ్యను ఆ కిరాతకుడు పొట్టన పెట్టుకున్నాడని చెప్పారు. సీఎం గారు చాలా బాగా స్పందించారని తెలిపారు. చట్ట ప్రకారం న్యాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దివ్య కుటుంబ సభ్యుల బాధను పూర్తిగా విన్నారని, న్యాయం చేస్తానని వారికి హామీ ఇచ్చారని చెప్పారు. దివ్య కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం అందించాలని చెప్పారని వెల్లడించారు. త్వరలోనే నిందితుడిని అరెస్ట్ చేస్తామని చెప్పారు. చట్ట ప్రకారం ఆ కుటుంబానికి పూర్తి న్యాయం చేస్తామన్నారు.





Untitled Document
Advertisements